Telangana 10th Results 2026: బీఎస్ఈ తెలంగాణ, మన బడి వెబ్సైట్ల ద్వారా టెన్త్ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. అలాగే 8096958096
అనే నెంబర్కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టి కూడా పదో తరగతి పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు.
TS SSC Result 2026 Date And Time: తెలంగాణ పదో తరగతి ఫలితాలు నేడు (ఏప్రిల్ 29న) విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14న ప్రారంభమైన ఈ పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 23 నాటికి పూర్తయింది. మే మొదటి వారంలో ఫలితాలను వెల్లడించాలని ముందుగా భావించారు. కానీ ప్రభుత్వం ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.
హైలైట్:
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు
నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాల వెల్లడి
ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ
Telangana 10th Results
తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు నేడు (ఏప్రిల్ 29) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు.. ఈ నెల 16వ తేదీతో విజయవంతంగా ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
పరీక్షలు ముగిసిన వెంటనే విద్యాశాఖ యుద్ధప్రాతిపదికన మూల్యాంకన (వాల్యుయేషన్) ప్రక్రియను చేపట్టింది. ఈ నెల 23వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేేశారు. దీంతో ఫలితాలను అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావించారు. కానీ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడంతోపాటు.. ఇంటర్, పాలిటెక్నిక్ లాంటి కోర్సుల్లో ప్రవేశాలకు వీలుగా ఈ నెల 29నే ఫలితాలను విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది.
ఈ ఏడాది పదో తరగతి ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అధికారికంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో ఉన్న గోదావరి ఆడిటోరియంలో మధ్యాహ్నం టెన్త్ ఫలితాలను వెల్లడిస్తారు. ఇప్పటికే మార్కుల నమోదు, సాంకేతిక తనిఖీలు పూర్తి కావచ్చాయని, విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లలో చూసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ తెలిపింది.
బీఎస్ఈ తెలంగాణ, మన బడి వెబ్సైట్ల ద్వారా టెన్త్ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. అలాగే 8096958096 అనే నెంబర్కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టి కూడా పదో తరగతి పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు.
గత ఏడాది ఉత్తీర్ణత శాతం ఇలా..
2025లో తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 91 శాతానికిపై ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు అత్యధికంగా 93.23 శాతం ఉత్తీర్ణులు కాగా.. బాలుర ఉత్తీర్ణతా శాతం 89.42 శాతంగా నమోదైంది. గత ఏడాది నిర్మల్ జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణతా శాతం నమోదైంది.
ప్రయివేట్ స్కూళ్ల విద్యార్థులే ఎక్కువ..
ఈసారి తెలంగాణలో 5.28 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి చదవగా.. అందులో 2.5 లక్షల మంది ప్రయివేట్ స్కూళ్లలో చదివిన వారే ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారు 2.07 లక్షల మంది ఉండగా.. సంక్షేమ పాఠశాలలో చదివిన వారు 60 వేల మంది ఉన్నారు. 10,512 మంది టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాశారు.