హైదరాబాద్‌లో కల్తీ టీ పొడి రాకెట్.. వాడేసిన టీ పొడికి రంగులు కలిపి విక్రయం, 3 వేల కిలోలు సీజ్

 హైదరాబాద్‌లో కల్తీ టీ పొడి రాకెట్.. వాడేసిన టీ పొడికి రంగులు కలిపి విక్రయం, 3 వేల కిలోలు సీజ్

హైదరాబాద్‌లో H-FAST బృందం నిర్వహించిన దాడుల్లో 3 వేల కిలోల కల్తీ టీ పొడి పట్టుబడింది. వాడేసిన టీ పొడికి సింథటిక్ రంగులు, బెల్లం కలిపి విక్రయిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి టీ తాగడం వల్ల కాలేయ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డీసీపీ గైక్వాడ్ హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేశారు. నగరంలో కల్తీ ఆహారపదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు వెల్లడించారు. ఆహార పదర్థాల విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.

హైలైట్:

హైదరాబాద్‌లో కల్తీ టీ పొడి రాకెట్

వాడేసిన టీ పొడికి రంగులు కలిపి విక్రయం

3 వేల కిలోలు సీజ్, 10 మంది అరెస్ట్

హైదరాబాద్ నగరంలో కల్తీ కోరలు చాస్తోంది. అగ్గి పుల్లా.. సబ్బు బిల్లా కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు ప్రతి వస్తువు కల్తీ చేస్తున్నారు. చిన్న పిల్లలు తినే చాక్లెట్లు, ఐస్‌క్రీం పాల ఉత్పత్తుల నుంచి వంటింటి సామాగ్రి వరకు ప్రతీది నకిలీది సృష్టిస్తున్నారు. తాజాగా నగరంలో భారీగా కల్తీ టీ పొడి పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పర్యవేక్షణలో H-FAST బృందం నగరవ్యాప్తంగా 15 చోట్ల మెరుపు దాడులు నిర్వహించింది. కల్తీ టీ పొడి తయారీ, పంపిణీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సాగిన ఈ సోదాల్లో 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేంద్రాల నుంచి సుమారు 3 వేల కిలోల కల్తీ టీ పొడి, 1500 కిలోల గడువు ముగిసిన టీ పొడి, ప్రమాదకరమైన కృత్రిమ రంగులు, 100 కిలోల బెల్లాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు అత్యంత ప్రమాదకరమైన రీతిలో ఈ కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తక్కువ నాణ్యత కలిగిన టీ పొడికి, ఇప్పటికే వాడేసిన, ఎక్స్‌పైర్ అయిన టీ పొడిని కలిపి భారీ లాభాలు గడించాలని ప్లాన్ చేశారు. దీనికి గాను టీ పొడి ఆకర్షణీయంగా కనిపించడానికి సన్‌సెట్ ఎల్లో FCF , టార్ట్రాజైన్ వంటి సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను, బెల్లం పాకాన్ని మిక్స్ చేస్తున్నారు. ఇలా తయారైన విషపూరిత మిశ్రమాన్ని ప్రముఖ బ్రాండ్ల పేరుతో, కొత్త పేర్లతో ప్యాకేజింగ్ చేసి మార్కెట్లో అసలైన టీ పొడిగా విక్రయిస్తున్నారు.

ఇటువంటి కల్తీ టీ పొడి వాడటం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు, అలెర్జీలు, దీర్ఘకాలంలో కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్న నిందితులపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత కింద కఠినమైన కేసులు నమోదు చేశారు. ఉత్పత్తి స్థాయిలోనే కల్తీని అరికట్టడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ప్రజలు ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ఏదైనా కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే H-FAST బృందానికి సమాచారం అందించాలన్నారు. కల్తీకి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *