వారం రోజులు నిప్పుల కుంపటే.. 10.30 నుంచి 4 గంటల్లోపు బయటికి వెళ్లొద్దన్న వాతావరణ శాఖ
వారం రోజులు నిప్పుల కుంపటే.. 10.30 నుంచి 4 గంటల్లోపు బయటికి వెళ్లొద్దన్న వాతావరణ శాఖ
తెలంగాణలో రానున్న రోజుల్లో భారీగా భానుడి ప్రతాపం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు చేశారు. వారం రోజుల పాటు నిప్పుల కుంపటిలా ఉంటుందని తెలిపారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదవుతాయని పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.
హైలైట్:
తెలంగాణలో వారం రోజులు నిప్పుల కుంపటే
మధ్యాహ్నం బయటికి వెళ్లొద్దన్న వాతావరణ శాఖ
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్
Telangana Weather
వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
తెలంగాణలో వచ్చే వచ్చే వారం రోజుల పాటు ఎండలు ఠారెత్తించనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సగటున 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వివరించింది. మధ్యాహ్నం సమయంలో భీకరమైన ఎండలు ఉంటాయని.. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని సూచించింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి వెళ్లొద్దని పేర్కొంటున్నారు.
ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల ప్రతాపం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కుమురం భీం, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల వంటి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఎండల తీవ్రత దృష్ట్యా ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. సోమవారం రోజున రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేశారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. రవీందర్ నాయక్ హెల్త్ అడ్వైజరీ జారీ చేశారు. దాహం వేయకపోయినా నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగాలని సూచిస్తున్నారు. బయటికి వెళ్లినపుడు తప్పకుండా తాగునీటిని వెంట ఉంచుకోవాలని తెలిపారు. పుచ్చకాయ, కీరదోస లాంటి నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు తినాలని పేర్కొంటున్నారు. తేలికగా ఉండే నూలు దుస్తులు ధరించడంతో పాటు బయటికి.. వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ తప్పనిసరిగా వాడాలని తెలిపారు.
మద్యం, టీ, కాఫీ, కూల్డ్రింక్స్తో పాటు ఎక్కువ ఉప్పు, కారం, మసాలాలు ఉండే ఆహారాలు తినొద్దని, తాగొద్దని పేర్కొన్నారు. వాంతులు, వికారం, చర్మం పొడిబారడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఎండల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అత్యవసర మందులను రెడీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశారు.