అమరావతి రైతులకు కౌలు రూ.40 వేలకు పెంపు.. రూ.1.50 లక్షలు రుణమాఫీ, ఉత్తర్వులు జారీ
అమరావతి రైతులకు కౌలు రూ.40 వేలకు పెంపు.. రూ.1.50 లక్షలు రుణమాఫీ, ఉత్తర్వులు జారీ
Amaravati Farmers Koulu Hiked To Rs 40000 And Runamafi Rs 1,50000: ఏపీ ప్రభుత్వం రాజధాని రెండో విడత భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు తీపికబురు చెప్పింది. ఇటీవల జరిగిన సమావేశంలో వార్షిక కౌలు పెంపు, రుణమాఫీపై హామీ ఇవ్వగా.. తాజాగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రైతులకు గతంలో ఎకరానికి ఏడాదికి కౌలు రూ.30 వేలుగా ఉంటే.. దానిని రూ.40 వేలకు పెంచారు. అలాగే ఏటా రూ.3 వేల చొప్పున పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే రూ.లక్షన్నర వరకు వ్యవసాయ రుణమాఫీకి ఓకే చెప్పారు.
హైలైట్:
అమరావతి రైతులకు తీపికబరురు
వార్షిక కౌలు రూ.40వేలకు పెంపు
రూ.1,50000 రుణ మాఫీ కూడా
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Amaravati Farmers Runa Mafi
అమరావతి రైతులకు కౌలు పెంపు, రుణమాఫీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతికి రెండో విడత భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు పెంచేందుకు, రుణ మాఫీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇటీవల రైతులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తాజాగా రాజధాని ప్రాంత భూ సమీకరణ పథకం-2025 నిబంధనల సవరణకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం జీవో నంబరు-118 (ఎంఏయూడీ) ప్రకారం గతంలో నిబంధనలు జారీ చేసింది.. ఇప్పుడు వాటిని సవరిస్తారు. ఏపీసీఆర్డీఏ అథారిటీ 60వ సమావేశంలో తీర్మానాన్ని పరిశీలించి, సవరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
గతంలో మొదటి సంవత్సర వార్షిక కౌలు చెల్లింపు ఒక ఎకరం మొట్ట భూమికి రూ.30వేలు, జరీబు భూమికి రూ.50వేలుగా ఉంది. తాజా సవరణలో భాగంగా మొదటి సంవత్సరం మెట్ట భూమికి రూ.40వేలు, జరీబు భూమికి రూ.60వేలు రైతులకు చెల్లిస్తారు. నిబంధనలు అమల్లోకి రాక ముందు వ్యవసాయం చేస్తూ, పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్డీడ్ ఉన్న రైతులకు రుణాలపై కుటుంబానికి గరిష్ఠంగా రూ.లక్షా 50వేలు రుణమాఫీ చేస్తామన్నారు. తాజా సవరణ ప్రకారం.. పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్డీడ్ ఉన్న రైతులకు 2025 డిసెంబరు 2వ తేదీ కంటే ముందున్న రుణాలపై కుటుంబానికి గరిష్ఠంగా రూ.లక్షా50వేలు వ్యవసాయ రుణమాఫీ చేస్తారు. గతంలో భూమి యజమానికి కేటాయించాల్సిన ప్లాటు (ఉమ్మడి ఆస్తి విషయంలో) విడివిడిగా ప్లాటు కావాలా..లేక ఉమ్మడిగా ప్లాటు కావాలా అని తెలపాల్సి ఉండేది. తాజా సవరణ ప్రకారం ప్లాట్ల ప్రాధాన్యాన్ని ఫారమ్-5 ఒప్పందం తర్వాత విడిగా తెలిపే అవకాశం ఇచ్చారు.
గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో సమావేశం అయ్యారు. రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. ఈ మేరకు ఆ రోజు సమావేశంలో ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని, ఏడాదికి రూ. 3 వేలు చొప్పున కౌలు పెంచుతామని ప్రకటించారు. అంతేకాదు కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. తాజాగా ఏపీ ప్రభుత్వం అవసరమైన ఉత్తర్వులు జారీ చేసింది.