తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు.. భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం..
తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు.. భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం..
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల హనుమాన్ జయంతి వేడుకలకు సిద్ధమైంది. మే 12న తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి ఘాట్ రోడ్డులో ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి వచ్చేందుకు, టీటీడీ భక్తుల కోసం ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. అలాగే భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
హైలైట్:
మే 12న తిరుమలలో హనుమాన్ జయంతి
భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
భక్తుల కోసం ప్రసన్న ఆంజనేయస్వామి గుడి వరకూ ఉచిత ప్రయాణ సౌకర్యం
Tirumala
హనుమాన్ జయంతి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఏటా వైశాఖ మాసం బహుళదశమి రోజున తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే మే 12వ తేదీ తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. మే 12న శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయంలో.. అలాగే కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతాయి.
హనుమాన్ జయంతి సందర్భంగా టీటీడీ తరుఫున జపాలిలోని హనుమాన్ ఆలయంలో పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీ. అలాగే మొదటి ఘాట్రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి మే 12వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు, స్థానికుల కోసం టీటీడీ తిరుమల నుంచి మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వరకూ, అలాగే తిరిగి తిరుమలకు టీటీడీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది.
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
శుక్రవారం రాత్రి తిరుమలలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాత్రి 7 గంటలకు మలయప్పస్వామి గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ సేవకు పురాణాల్లో అత్యంత ప్రాధాన్యం ఉంది. గరుడ వాహనం ద్వారా స్వామి దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారని పండితులు చెప్తుంటారు.
అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మనిషి.. జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో గరుడ సేవ రోజున, పౌర్ణమి గరుడ సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ముందస్తు చర్యలు చేపడుతూ ఉంటుంది.