మే 1 నుంచి LPG సిలిండర్లకు కొత్త రూల్స్.. బుకింగ్ టైమ్ నుంచి ధరల పెంపు వరకు మారేవి ఇవే!
మే 1 నుంచి LPG సిలిండర్లకు కొత్త రూల్స్.. బుకింగ్ టైమ్ నుంచి ధరల పెంపు వరకు మారేవి ఇవే!
LPG Rule Changes Update: పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారతీయ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడింది. ధరల పెరుగుదల భారం మోయాల్సి వస్తోంది. అలాగే గ్యాస్ కొరత కారణంగా రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అంతే కాదు మే 1, 2026 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనలతో పాటు కొత్త నెల ప్రారంభంలో సిలిండర్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పీఎన్జీ సరఫరా ఉన్న యూజర్లకు సరఫరా నిలిచిపోనుంది. మరి ఆ వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
LPG Rule Changes Update: గత నెల రోజులకు పైగా పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లను అస్తవ్యస్తం చేస్తూనే ఉన్నాయి. శాంతి చర్చలు జరుగుతున్నా కొలిక్కి రాకపోవడం, హార్ముజ్ జలసంధిపై ఆంక్షలు ఇంధన సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయి. దీంతో భారతదేశంలోని ఎల్పీజీ వినియోగదారులు ఇంధన ధరల గురించి నిరంతర ఆందోళన చెందాల్సి వస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం సిలిండర్ ధరలను మార్చి నెలలోనే ఒకసారి పెంచింది. ఇప్పుడు మళ్లీ మేర 1వ తేదీన పెంచవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ధరల పెంపుతో పాటు ఈసారి బుకింగ్, డెలివరీ వ్యవస్థలోనూ కొత్త నిబంధనలు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ల వినియోగం, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం బుకింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. మే 1వ తేదీ నుంచే ఈ కొత్త మార్పులు అమలులోకి రావచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మే 1 ధరల పెంపు?
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగి భారత్లో ఆయిల్ ధరలను పెంచుతున్నాయి. గత నెలలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.60 మేర పెంచిన సంగతి తెలిసిందే. అలాగే 19 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలను నెల రోజుల్లోనే 3 సార్లు పెంచారు. మెట్రో నగరాల్లో 2026, ఏప్రిల్ నెలలో రూ.196 మేర పెరిగాయి. మార్చి 7వ తేదీన రూ.114.5 మేర పెంచిన సంగతి తెలిసిందే. అంతకు ముందు మార్చి 1వ తేదీన రూ.31 వరకు పెంచారు. అలాగే కంపెనీలు సాధారణంగా ఒకటో తేదీన ధరలను సమీక్షిస్తుంటాయి. అందులో భాగంగా మే 1వ తేదీన సైతం ధరలను పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ రూల్స్
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ కఠినతరం చేసింది. నగరాల్లోని వినియోగదారులు బుకింగ్స్ కోసం 25రోజుల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. అంతకు ముందు ఇది 21 రోజులుగా ఉండేది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజుల తర్వాతే బుకింగ్ చేసుకునేందుకు వీలుంటుంది.
డెలివరీ సిస్టమ్లోనూ మార్పులు
గ్యాస్ బుకింగ్ నిబంధనలతో పాటు డెలివరీ వ్యవస్థలోనూ కేంద్రం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఓటీపీ- ఆధారిత అథెంటికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ సిస్టమ్ను శాశ్వతంగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సబ్సిడీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కి తరలించకుండా ఈ వ్యవస్థ నిరోధిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ బుకింగ్స్ ప్రస్తుతం 98 శాతంగా ఉన్నాయి. అందులో 94 శాతం వరకు డెలివరీలు ఓటీపీ అథెంటికేషన్ తో వెరిఫై చేస్తున్నారు. ఈ నిబంధనలను మే 1 నుంచి మరింత కఠినతరం చేయవచ్చని తెలుస్తోంది.
ఆధార్ ఇ-కేవైసీ తప్పనిసరి
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా సిలిండర్ పొందిన లబ్ధిదారులు ప్రతి సంత్సరం ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇతర ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు ప్రతిసారి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి చేస్తే సరిపోతుంది. పీఎంయూవై లబ్ధిదారులు మాత్రం ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి పూర్తి చేయాలి. ఇ-కేవైసీ పూర్తి చేయని వారికి సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.
పీఎన్జీకి మారాల్సిందేనా?
ఎల్పీజీ సిలిండర్ల కొరతను నిరోధించేందుకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)కి మారాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే పీఎన్జీ కనెక్షన్లు ఉన్న వారు ఇకపై ఎల్పీజీ కనెక్షన్లు తీసుకునేందుకు అర్హత ఉండదు. తప్పనిసరిగా వారు పీఎన్జీకి మారాల్సిందే. ఇప్పటికే సిలిండర్ కనెక్షన్లు ఉన్నప్పటికీ వాటిని సరెండర్ చేయాలి. ఎందుకంటే వారికి సిలిండర్ల సరఫరాలను ఆపేయనున్నారు. మూడు నెలల సమయం కల్పించారు. మార్చి 2026 నుంచి 5.45 లక్షల పీఎన్జీ కనెక్షన్లను ఇన్స్టాల్ చేసినట్లు కేంద్రం చెబుతోంది. మరో 2.62 లక్షలు బిగించేందుకు సిద్ధంగా ఉన్నాయి.