కేరళలో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం.. నేను ఎప్పటికీ మరవలేను’.. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్
కేరళలో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం.. నేను ఎప్పటికీ మరవలేను’.. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలకు అభినందనలు తెలిపారు. రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో ఈ గెలుపు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతు ఇచ్చిన కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపారు. అక్కడి ప్రజలు తనపై చూపించిన ప్రేమను ఎప్పటికీ మరవలేనని అన్నారు. తెలంగాణ-కేరళ రాష్ట్రాలు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పథంలో దూసుకుపోతాయని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
హైలైట్:
కేరళలో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం
నేను ఎప్పటికీ మరవలేను
సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్
etala rajender meets Revanth
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ కూటమి అభ్యర్థులు 104 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అధికార ఎల్డీఎఫ్ 34 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. కేరళలో కాంగ్రెస్ కూటమి సాధించిన చారిత్రాత్మక విజయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ అఖండ విజయం పట్ల కూటమి నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ శ్రేణులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
కేరళలో ఈ అద్భుత విజయం సాధించడానికి మార్గనిర్దేశం చేసిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపా దాస్ మున్షీలకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారి సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఈ చారిత్రాత్మక గెలుపు సాధ్యమైందని ఆయన కొనియాడారు. కేరళలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ద్వారా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు.
కేరళలో సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్గా పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా.. తన ప్రచార పర్యటనను గుర్తు చేసుకుంటూ రేవంత్ రెడ్డి కేరళ ప్రజలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘నేను కేరళలో ప్రచారం చేస్తున్న సమయంలో అక్కడి ప్రజలు నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మరువలేను. యూడీఎఫ్ మద్దతుదారులకు, కేరళ ప్రజలకు తెలంగాణ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. కేరళ ఓటర్లు అభివృద్ధిని, ప్రజాస్వామ్య విలువలను నమ్మి కాంగ్రెస్కు పట్టం కట్టారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ, కేరళ రాష్ట్రాలు పురోగతి విలువలు, ప్రజాస్వామ్య సిద్ధాంతాలు కలిగిన గొప్ప రాష్ట్రాలని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. గత దశాబ్ద కాలంగా నిరాశ, నమ్మకద్రోహానికి గురైన కేరళ ప్రజలు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉజ్వల భవిష్యత్తును పొందబోతున్నారని అన్నారు. తెలంగాణలో ఇప్పటికే ప్రజా ప్రభుత్వం కొనసాగుతుండగా.. ఇప్పుడు కేరళలో కూడా కాంగ్రెస్ అధికారం చేపట్టడం ద్వారా రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో కలిసి నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయం వెనక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వ్యాఖ్యనించారు. యూడీఎఫ్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహారించారని అన్నారు. కేరళ సీఎం విజయన్పై.. రేవంత్ రెడ్డి నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారని దయాకర్ గుర్తు చేశారు. కేరళ అభివృద్ధిపై విజయన్ను నిలదీయడంతోపాటు వరుసగా లేఖలు కూడా రాశారని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేరళ ప్రచారంలో రేవంత్రెడ్డి వివరించటం వల్లే విజయం సాధ్యమైందన్నారు.