TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విడుదల తేదీ ఫిక్స్, ఎప్పుడంటే?
TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విడుదల తేదీ ఫిక్స్, ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. మార్చి 18తో పరీక్షలు ముగియగా.. ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ బోర్డు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఈ ఫలితాల తర్వాత పదో తరగతి రిజల్ట్స్ సైతం రానున్నాయి.
హైలైట్:
తెలంగాణ ఇంటర్ ఫలితాలు
ఈనెల 10-12 మధ్య విడుదల
త్వరలోనే అధికారిక ప్రకటన
TS Inter Results
ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్య ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో.. కంప్యూటరీకరణ, రీవెరిఫికేషన్ వంటి అంశాలు వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికతో ముందుకెళుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 18వ తేదీతో ముగిశాయి. మొత్తం 1,495 పరీక్షా కేంద్రాల్లో సుమారు 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 25న మొదలవ్వగా.. మరుసటి రోజైన 26 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరిగాయి. గతంతో పోలిస్తే ఈసారి పరీక్షలు అత్యంత పకడ్బందీగా.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడం గమనార్హం. ఫలితాల విడుదల ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. జవాబు పత్రాల స్కానింగ్, కోడింగ్, డీ-కోడింగ్ ప్రక్రియలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఫలితాల వెల్లడికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఫలితాల రోజున వెబ్సైట్పై ఒత్తిడి పెరిగి సాంకేతిక ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ను నమోదు చేయడం ద్వారా మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల అనంతరం రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్కు సంబంధించిన గడువును కూడా బోర్డు వెంటనే ప్రకటించనుంది. ముందుగా ఇంటర్ ఫలితాలను విడుదల చేసి.. ఆ తర్వాతే పదో తరగతి ఫలితాల వైపు అధికారులు దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతుండగా.. ఈనెల 16తో పరీక్షలు ముగియనున్నాయి.