TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు..
TDP: తలకిందులైన టీడీపీ జెండా.. రివర్స్లో ఎగరేసిన తెలుగు తమ్ముళ్లు..
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏపీలోని టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో టీడీపీ జెండాను తలకిందులుగా ఎగరవేశారు తెలుగు తమ్ముళ్లు. ఆ తర్వాత విషయం గుర్తించి పొరబాటు సరిదిద్దుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
TDP Flag reversed chittoor
తలకిందులైన టీడీపీ జెండా
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాలలో టీడీపీ జెండాను ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరులో టీడీపీ జెండాను తలకిందులుగా ఎగరవేయడం వైరల్ అవుతోంది. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని చిత్తూరులోని పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ జెండాను ఎగరవేసిన తెలుగు తమ్ముళ్లు.. జెండాను ఎగరేసిన తర్వాత అసలు సంగతి గుర్తించారు. జెండాను కట్టే సమయంలో చూసుకోకుండా తలకిందులుగా కట్టటంతో.. ఆవిష్కరించేటప్పుడు టీడీపీ జెండా తలకిందులైంది.
దీంతో పొరబాటును గుర్తించిన నేతలు వెంటనే అప్రమత్తయ్యారు. టీడీపీ జెండాను సరిదిద్ది మరోసారి ఎగరవేశారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కామెంట్ చేస్తు్న్నారు. జెండాను కట్టే సమయంలో సరిగ్గా ఉందో చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా అని సూచిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంగళగిరిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
మరోవైపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. 44 ఏళ్ల కాలంలో టీడీపీ ఎన్నో సంక్షోభాలు, సవాళ్లను ఎదుర్కొని తట్టుకుని నిలబడిందని అన్నారు. పార్టీ కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని.. మరెంతో మంది ఆస్తులు పోగొట్టుకున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏమీ చేయలేకపోయారన్న చంద్రబాబు.. ఇకపైనా చేయలేరని స్పష్టం చేశారు.
టీడీపీలో సమర్థంగా పనిచేసే కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుందన్న చంద్రబాబు.. వారి త్యాగాలను విస్మరిస్తే ప్రమాదమని నేతలకు సూచించారు. ఇక మీదట ఏ ఎన్నికలు జరిగినా విజయం టీడీపీదే కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే తెలుగుజాతి.. 2019 ఎన్నికలలో విజయం సాధించి ఉంటే అమరావతి వేరేలా ఉండేవని అన్నారు. టీడీపీ బలంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బలంగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
మరోవైపు త్వరలోనే 50శాతం అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయని చంద్రబాబు అన్నారు. ఈ మూడేళ్ళలో ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్లకే రాబోయే రోజుల్లో సీట్లు ఇస్తామని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసే వాళ్లను గుర్తించే బాధ్యత లోకేష్ది అయితే.. అవకాశం ఇచ్చే బాధ్యత తనదని అన్నారు.