నేడు రైతు భరోసా నిధుల విడుదల.. రేపు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు, ఇతర పంటలకూ బోనస్..!
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. రేపు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు, ఇతర పంటలకూ బోనస్..!
తెలంగాణ ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 73 లక్షల మంది రైతులకు ఈ పెట్టుబడి సాయం అందనుంది. తొలి విడతగా ఎకరం లోపు ఉన్న రైతులకు 3,590 కోట్లు సోమవారం ఖాతాల్లో జమకానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇదే వేదికగా నూనెగింజలు, పప్పుధాన్యాల వంటి ఇతర పంటలకు బోనస్ ప్రకటించే అవకాశం ఉంది.
హైలైట్:
నేడు రైతు భరోసా నిధుల విడుదల
రేపు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు
ఇతర పంటలకు సైతం బోనస్..!
Rythu Bharosa
తెలంగాణ రైతులకు గుడ్న్యూస్. నేడు రేవంత్ సర్కార్ పంట పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్రెడ్డి నేడు సాయంత్రం ప్రారంభించనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికగా.. రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులుండగా… వీరిలో తొలి విడతలో ఒక ఎకరం వరకు సాయం అందించనున్నారు.
ఈ మేరకు రూ.3,590 కోట్లు ఆదివారం ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు అటు నుంచి రైతులకు చేరతాయి. ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో రేపు (సోమవారం) రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమవుతాయి. ఆ తర్వాత ఇరవై రోజుల అనంతరం రెండో విడతలో రూ.2,650 కోట్లు, చివరి విడతగా రూ.2,760 కోట్లు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం వరకు, 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
ఇక నర్మెటలో ఆయిల్పామ్ కర్మాగారం అందుబాటులోకి రానుండటంతో ఉత్తర, దక్షిణ తెలంగాణలోని 18 జిల్లాల రైతులకు మేలు జరగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిశ్రమలో రూ.80 కోట్లతో రిఫైనరీని సైతం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు. ఇది రెడీ అయితే స్థానికంగానే పామాయిల్ను ఉత్పత్తి చేయొచ్చునని చెబుతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం, కొణిజర్ల, ములుగు జిల్లా ఇంచర్ల, పెద్దపల్లి జిల్లా పెద్దరాత్పతి, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి, గద్వాల జిల్లా బీచుపల్లిలో ఈ సంవత్సరాంతానికి మరో ఆరు కర్మాగారాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.
దాంతో పాటుగా పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు తెలంగాణలో కొరత, డిమాండ్ ఉన్న పంటలకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త పంటలకు బోనస్పై విధాన నిర్ణయం ఇవాళ్టి సభలో సీఎం ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది. ప్రభుత్వం గత రెండేళ్లుగా సన్నవడ్లకు ప్రోత్సాహకంగా క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తోంది. ఆయిల్పామ్తోపాటు ఇతర నూనెగింజలు, పప్పుధాన్యాలు, వేరుసెనగ, పసుపు, మొక్కజొన్న పంటలకు సైతం బోనస్ ఇవ్వాలని డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పంటలకు కూడా బోనస్ ఇచ్చే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.