మండు వేసవిలో చల్లని కబురు.. వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు

 మండు వేసవిలో చల్లని కబురు.. వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షం హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతోందని దాని కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేటి నుంచి ఈనెల 21 వరకు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

హైలైట్:

మండు వేసవిలో చల్లని కబురు

వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

Telangana Weather

మండు వేసవిలో తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రానున్న 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నేటి నుంచి ఈనెల 21 మధ్య కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు మొదలు మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని చోట్లకు విస్తరిస్తాయని తెలిపారు.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. 10సెం.మీ లోపు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని దాని ఫలితంగానే వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ఈనెల 21 వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కాస్త తక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచే వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఇన్నాళ్లు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వానలు ఉపశమనం కలిగించాయి.

ఎండలకు కాస్త బ్రేక్..

ఈసారి తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా మార్చి మెుదటి వారం నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరి రెండో వారం నుంచే భానుడి భగభగలు మెుదలయ్యాయి. మార్చి మెుదటి నాటికి చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాయి. మధ్యాహ్నం అయితే చాలా హైదరాబాద్ నగరంతో పాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో వాహనాల రాకపోకలు లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి.

ఇక పగలు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుండగా.. రాత్రి అయితే చాలు తీవ్రమైన ఉక్కపోత ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో ప్రజలు ఏసీలు, కూలర్లు వాడుతుండగా.. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ వినియోగం నమోదైంది. ప్రస్తుతం 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించటంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *