నర్మెటలో ఆయిల్ పామ్ రిఫైనరీ.. రైతుకు మద్దతు ధర, నిరుద్యోగులకు ఉపాధి
తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే అతిపెద్ద ఆయిల్పామ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ఈ రిఫైనరీని ప్రారంభించనున్నారు. మలేషియా సాంకేతికతతో నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా ముడి చమురును శుద్ధి చేసి నేరుగా వంట నూనెను ఉత్పత్తి చేయనున్నారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు, సుమారు 1000 మందికి ఉపాధి లభించనుంది.
హైలైట్:
నర్మెటలో ఆయిల్ పామ్ రిఫైనరీ
ఆయిల్ పామ్ రైతుకు మద్దతు ధర
నిరుద్యోగులకు ఉపాధి
Telangana Oil Palm
తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు తీపి కబురు. ఇక నుంచి రాష్ట్రం పామాయిల్ తయారీ కేంద్రంగా మారనుంది. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్పామ్ రిఫైనరీ ఏర్పాటు చేసి నూనె ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2.91 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేటలలో ఆయిల్పామ్ శుద్ధి కర్మాగారాలున్నాయి. కొత్తగా నర్మెటలో రాష్ట్రంలోనే అతిపెద్ద కర్మాగారాన్ని రూ.300 కోట్లతో నిర్మించారు. ఈ నెల 22న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ రిఫైనరీ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఉన్న రెండు కర్మాగారాల్లో ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో ముడిచమురు మాత్రమే తీస్తున్నారు. దీనిని మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడి రిఫైనరీలలో నూనెలుగా తయారు చేసి దానిని పామాయిల్గా మారుస్తున్నారు.
దీనిని ఆయిల్ఫెడ్ కొనుగోలు చేసి విజయ నూనెలుగా మార్కెట్లో విక్రయిస్తోంది. రాష్ట్రంలో నూనెల తయారీకి రిఫైనరీ ఏర్పాటు అంశాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నర్మెటలో దాని ఏర్పాటును ప్రతిపాదించగా సీఎం రేవంత్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న నర్మెట ఆయిల్పామ్ శుద్ధి కర్మాగారం ప్రారంభోత్సవం రోజునే దానిని ఆనుకొని రెండు ఎకరాల స్థలంలో భారీ రిఫైనరీకి శంకుస్థాపన చేయాలని డిసైడ్ అయ్యారు. అనంతరం ఆరు నెలల్లో పూర్తి చేసి పామాయిల్ ఉత్పత్తి ప్రారంభిస్తారు.
మలేసియా సాంకేతిక పరిజ్ఞానంతో నర్మెటలో ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యా్క్టరీలో గెలల క్రషింగ్ మొదలుకానుంది. గంటకు 30 టన్నుల సామర్థ్యంతో క్రషింగ్ చేపట్టనున్నారు. దీన్ని దశలవారీగా రోజుకు 120 నుంచి 600 టన్నులకు పెంచే వీలుంది. పరిశ్రమకు అవసరమైన విద్యుత్తును గెలల వ్యర్థాలతోనే ఉత్పత్తి చేసేందుకు గాను నాలుగు మెగావాట్ల ప్లాంటును ఇక్కడే ఏర్పాటు చేశారు. సమీపంలోనే 10 కోట్ల లీటర్ల నీటిని నిల్వచేసే రిజర్వాయరును సైతం నిర్మించారు. నీరు వృథా కాకుండా.. రీసైక్లింగ్ పద్ధతిలో వినియోగించనున్నారు. ఈ రిఫైనరీ ప్రారంభంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1000 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రైతులకు సైతం సరైన మద్దతు ధర లభించనుంది.