హైదరాబాద్లో 556 కి.మీ.ల మేర మెట్రో విస్తరణ.. మూసీ నదిపై 29 బ్రిడ్జిలు.. రూ.4 లక్షల కోట్ల ప్రణాళిక
హైదరాబాద్ నగరం రూపురేఖలు మార్చేందుకు హెచ్ఎండీఏ అనేక రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగరంలో మెట్రోను భారీగా విస్తరించాలని భావిస్తోంది. నగరం నడిబొడ్డున మూసీ నదిపై భారీగా వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపింది. ఇవే కాకుండా నగరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్లు, రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జిలు సహా సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్లాన్లు రెడీ చేస్తోంది.
HMDA
హైదరాబాద్ అభివృద్ధిపై హెచ్ఎండీఏ 2050 ప్రణాళికలు
ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక మహా నగరంగా అవతరిస్తోంది. గత 10 ఏళ్లలో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వరకు శరవేగంగా విస్తరించిన హైదరాబాద్ మహా నగరం.. మరింతగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా.. ప్రపంచ దేశాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి ఉద్యోగం, ఉపాధి, విద్య వంటి అవసరాల కోసం జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ప్రభుత్వాలు.. హైదరాబాద్లో మౌలిక సదుపాయాలను కూడా అదే వేగంతో కల్పిస్తున్నాయి. అయినప్పటికీ నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మరింత మంది ప్రజలు, వాహనాలు పెరిగిపోతాయనే అంచనాలతో ట్రాఫిక్ రద్దీని నిర్వహించేందుకు మౌలిక వసతులను సర్కార్ కల్పిస్తోంది.
ఈ నేపథ్యంలోనే 2050 నాటికి హైదరాబాద్ మహా నగరాన్ని ఏ విధంగా మార్చాలి అనే దానిపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ( హెచ్ఎండీఏ ) సమగ్ర రవాణా వ్యవస్థపై కీలక ప్రణాళికను రెడీ చేసింది. 2050 నాటికి హైదరాబాద్ నగరంలో మెట్రో నెట్వర్క్ను ఏకంగా 556.6 కిలోమీటర్ల మేర విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దాదాపు 70 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించి ఉండగా.. రెండో విడతలో భాగంగా మరో 150 కిలోమీటర్ల వరకు విస్తరించేందుకు అనుమతులు లభించాయి.
ఇక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) నెట్వర్క్ను 336.4 కిలోమీటర్ల వరకు పెంచాలని హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇక హైదరాబాద్ నగరంలో రోడ్ల నెట్వర్క్ను 19,352 కిలోమీటర్లకు విస్తరించాలని భావిస్తోంది. అదే సమయంలో నగరంలో కొత్తగా 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, స్కైవాక్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఇవే కాకుండా 34 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్వోబీలు), 16 రైల్ అండర్ బ్రిడ్జిలు (ఆర్యూబీలు), 8 ఎలివేటెడ్ రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్లు హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో హైదరాబాద్ నగరం మధ్య నుంచి వెళ్తున్న మూసీ నదిపై 29 బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. 2050 నాటికి ప్రత్యేక బస్ లైన్ల కోసం 48 కిలోమీటర్ల మేర రోడ్ కారిడార్లను గుర్తించినట్లు తెలిపారు. 7 అంతర్రాష్ట్ర బస్సు, ట్రక్ టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే 2050 హైదరాబాద్ నగర సమగ్ర రవాణా వ్యవస్థ ప్రణాళిక కోసం రూ.4 లక్షల కోట్లు అవసరం అవుతాయని హెచ్ఎండీఏ అంచనాలు వేస్తోంది