వాహనదారులకు అలర్ట్.. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్‌..!

 వాహనదారులకు అలర్ట్.. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్‌..!

వాహనదారులకు అలర్ట్.. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్‌..!

తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, పెండింగ్ చలాన్ల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్‌లైన్ గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేస్తూ.. చలాన్ల జారీ, చెల్లింపులకు నిర్దిష్ట గడువులతో కూడిన కొత్త ఎస్‌వోపీని రవాణా శాఖ అమలు చేయనుంది.

హైలైట్:

వాహనదారులకు అలర్ట్

చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్‌..!

త్వరలోనే అమలు కానున్న కొత్త రూల్స్

telangana Traffic Challans

వాహనదారులకు అలర్ట్. పెండింగ్ చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్‌ అయ్యే ఛాన్సుంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను సీరియస్‌గా తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ చలాన్ల వసూలు, వివాదాల పరిష్కారం కోసం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇకపై ట్రాఫిక్ రూల్స్ పదేపదే అతిక్రమించినా, పెండింగ్‌లో ఉన్న చలాన్లను సకాలంలో చెల్లించకపోయినా మీ డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ) ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ మేరకు రవాణా శాఖ కఠిన నిబంధనలతో కూడిన నూతన విధానాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. కేంద్ర మోటార్‌ వాహన నిబంధనలకు అనుగుణంగా జరిమానాలపై వచ్చే అభ్యంతరాలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ‘గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీ’ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే వెలువడనున్నట్లు రవాణాశాఖ వర్గాల నుంచి సమాచారం.

ఈ కొత్త విధానం ప్రకారం.. ట్రాఫిక్ చలాన్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాహనదారులు కేవలం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే తమ ఫిర్యాదులను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తులకు తావుండదు. పోలీసు శాఖకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్ వంటి ప్రధాన కమిషనరేట్లలో ట్రాఫిక్ డీసీపీలు, ఇతర జిల్లాల్లో ఎస్పీలు లేదా అదనపు ఎస్పీలు ఈ ఫిర్యాదులను పరిశీలిస్తారు. రవాణా శాఖ పరిధిలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, ఆర్టీవోలు గ్రీవెన్స్ అధికారులుగా వ్యవహరిస్తారు. సాంకేతిక లోపాలు, డేటా ఎంట్రీ పొరపాట్లు, వాహనం విక్రయించిన తర్వాత వచ్చే తప్పుడు చలాన్ల వంటి సమస్యలను ఈ అధికారులు నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తారు.

చలాన్ల జారీ, పరిష్కార ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని నిర్ణయించింది. కెమెరా ఆధారిత చలాన్లను 3 రోజుల్లోగా, మాన్యువల్ చలాన్లను 15 రోజుల్లోగా వాహనదారులకు పంపాలి. చలాన్ అందిన 45 రోజుల్లోపు వాహనదారుడు జరిమానా చెల్లించాలి లేదా అభ్యంతరాన్ని దాఖలు చేయాలి. ఫిర్యాదు అందిన 30 రోజుల్లోపు అధికారులు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారు. ఒకవేళ అధికారుల నిర్ణయంతో ఏకీభవించకపోతే.. చలాన్ మొత్తంలో 50 శాతం చెల్లించి కోర్టును ఆశ్రయించే వెసులుబాటు కూడా కల్పించారు. కోర్టు నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి.

ఒక వాహనంపై ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే.. ఆ సమాచారం నేరుగా రవాణా శాఖకు చేరుతుంది. వెంటనే సదరు వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన ఆర్సీని అధికారులు బ్లాక్ చేస్తారు. ఇలా బ్లాక్ అయిన పక్షంలో, ఆ వాహనానికి లేదా లైసెన్స్‌కు సంబంధించిన ఎటువంటి ఆర్టీఏ సేవలు పొందే అవకాశం ఉండదు. పెండింగ్ చలాన్లన్నీ చెల్లించిన తర్వాతే సేవలు తిరిగి పునరుద్ధరించబడతాయి. ఈ కఠిన నిబంధనల ద్వారా రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు, వాహనదారుల్లో బాధ్యతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *