‘తెలంగాణలో ఇక టెన్త్ పరీక్షలకు గుడ్బై.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు’: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఇక నుంచి టెన్త్ పరీక్షలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలో విద్యా బోధన జరగనున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Revanth Reddy.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీడియాతో చిట్ చాట్గా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. పలు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్ర విద్యా విధానంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఇక నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఉండవని సంచలన వ్యాఖ్యలు చేశారు. సమూల మార్పులు తేనున్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి.. జాతీయ స్థాయిలో ప్లస్ 2 విధానం అమలులో ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత తెలంగాణలోనూ విద్యా వ్యవస్థలో మార్పులు చేయనున్నట్లు చెప్పారు.
ఇక నుంచి తెలంగాణలో సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (ఎస్ఎస్సీ) బోర్డు లేనట్టేనని.. పదో తరగతి పరీక్షలు కూడా ఉండబోవని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై కమిటీ అధ్యయనం చేస్తోందని వివరించారు. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి విద్యా శాఖ కమిషన్ ఇచ్చే నివేదిక ఫైనల్ కాదని పేర్కొన్నారు. తమది సంక్షేమం, అభివృద్ధి కలగలిసిన బడ్జెట్ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడంపై సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతలు చెవిలో పువ్వులు కాదని.. వంగబెట్టి వీపుపై బండలు కట్టాలని పేర్కొన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బయటికి రాకుండా గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. ఇక తెలంగాణ జాతిపిత ఎవరు అనేది రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేయాలన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా రేవంత్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ పూర్తి కాకుండా ఇప్పుడే ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రమ్మని తనకు నోటీసులు ఇస్తే వెళ్తానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్చిట్ ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. పంజాగుట్టలో ప్రైవేట్ కేసులో మాత్రమే క్లీన్చిట్ వచ్చిందని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6 వేల ఫోన్లను ట్యాప్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటివరకు కేటీఆర్, హరీష్ రావు ఏ విచారణ కోరినా అందుకు తమ ప్రభుత్వం రెడీగా ఉందని వెల్లడించారు.
మరోవైపు.. ఆరు గ్యారెంటీల అమలు కోసం తమ ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని చెప్పిన రేవంత్ రెడ్డి.. భూములను అమ్మగా వచ్చిన డబ్బులను సొంత అవసరాలకు వాడుకోవడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వెనకుడు వేసేది లేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా నష్టపోయిన వారిని ఎలా ఆదుకోవాలో ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటామని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి ఎన్ని సార్లు వెళ్లానో లెక్క పెట్టే వారు.. తాను ఎన్ని నిధులు తెచ్చానో లెక్కపెట్టాలని పేర్కొన్నారు. గాంధీ ముని మనవడు కూడా ఒక పౌరుడేనని.. ఆయన బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డాడని తెలిపారు.
ఇక.. రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో బీజేపీ స్పందించడం లేదని.. బీఆర్ఎస్ వాళ్లని తిడితే బీజేపీ ఎందుకు మాట్లాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎంను ఎన్నుకుంటారని.. తనను ముఖ్యమంత్రిగా అంగీకరిస్తున్న మంత్రులకు ధన్యవాదాలు చెప్పారు. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంశాన్ని టీపీసీసీ చూసుకుంటుందని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని.. దానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని స్పష్టం చేశారు.