కాంగ్రెస్ ఆఫీస్లో విచిత్ర దొంగతనం.. ఛీ ఛీ అవి కూడానా.. ఐ లవ్ యూ అని రాసి వెళ్లిన దొంగలు
కాంగ్రెస్ ఆఫీస్లో విచిత్ర దొంగతనం.. ఛీ ఛీ అవి కూడానా.. ఐ లవ్ యూ అని రాసి వెళ్లిన దొంగలు
కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో దొంగతనం జరిగింది. ఆఫీసులో ఏర్పాటు చేసిన నల్లాలకు ఉండే ట్యాప్లను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా అక్కడ ఐ లవ్ యూ అని రాసి వెళ్లారు. ఇక ఆ కాంగ్రెస్ ఆఫీసులో చోరీ జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. పదే పదే తమ ఆఫీసులో దొంగతనం జరగడం పట్ల హస్తం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ విచిత్ర దొంగతనం ఎక్కడ జరిగింది. ఆ సంగతులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
హైలైట్:
కాంగ్రెస్ ఆఫీస్లో విచిత్ర దొంగతనం
ఛత్తీస్గఢ్లో 72 స్టీల్ ట్యాప్లు చోరీ
ఐ లవ్ యూ అని రాసి వెళ్లిన దొంగలు
Congress
కాంగ్రెస్ ఆఫీస్లో విచిత్ర దొంగతనం
కొన్ని కొన్ని దొంగతనాలు చాలా వింతగా ఉంటాయి. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. భారీ దొంగతనానికి వచ్చి దొంగలు చిల్లర సామాన్లు ఎత్తుకుపోవడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి దొంగతనాలు చూసినపుడు, వాటి గురించి విన్నప్పుడు అయ్యో అనడం మానేసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వస్తుంటుంది. తాజాగా ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ దొంగతనం ఇప్పుడు ఇదే రకంగా మారింది. ఆఫీసులోని నల్లా ట్యాప్లు చోరీకి గురి కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ వింత చోరీ జరిగింది. ఆఫీసులోని బాత్రూంలలో ఏర్పాటు చేసిన 72 స్టీల్ నల్లా ట్యాప్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. అయితే ఇప్పటికే ఈ ఆఫీసులో రెండు సార్లు దొంగతనాలు జరిగాయని.. ఇప్పుడు జరగడం ముచ్చటగా మూడోసారి అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. అయితే అంబికాపూర్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైన గాంధీ చౌక్ సమీపంలోని రాజీవ్ భవన్లో ఉన్న కార్యాలయంలో ఈ వరుస దొంగతనాలు జరగడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇక ఆ నీళ్ల ట్యాప్లను దొంగిలించిన తర్వాత దొంగలు బయటికి వెళ్లిపోయే ముందు ‘I Love You Ambikapur’ (ఐ లవ్ యూ అంబికాపూర్) అంటూ రాసి వెళ్లడం గమనార్హం. ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. అంబికాపూర్లో శాంతి భద్రతల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈ 3 దొంగతనాలు వెల్లడిస్తున్నాయని.. అదే సమయంలో పోలీసులు, నగరంలో భద్రతా పరిస్థితులపైనా తీవ్ర విమర్శలు చేశారు.
ఇక ఈ ఘటన జరిగిన తర్వాత ఆ పార్టీ ఆఫీసును పరిశీలించిన కాంగ్రెస్ నాయకుడు బాలకృష్ణ పాఠక్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయికి బానిసైన వ్యక్తులు లేదా సంఘ వ్యతిరేక శక్తులే ఈ చోరీలకు పాల్పడి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంబికాపూర్ నగరంలో నేరాలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయని.. పోలీసులు నిర్వహిస్తున్న రాత్రి గస్తీ కేవలం పేరుకే పరిమితమైందని ఆరోపించారు.
నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకో భద్రత లేకపోతే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వీలైనంత తొందర్లో దొంగలను పట్టుకుంటామని తెలిపారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.