తిరుమల: పిల్లలకు ఉచితంగా అక్షర గోవిందం కిట్లు.. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు
తిరుమల: పిల్లలకు ఉచితంగా అక్షర గోవిందం కిట్లు.. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు
టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ నిర్వహించే అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు ఉచితంగా కిట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. వీటితో పాటుగా టీటీడీలోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు శ్రీవారి దర్శనం, లడ్డూ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. స్పర్శదర్శనం క్యూలైన్లలో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
హైలైట్:
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
పిల్లలకు ఉచితంగా అక్షర గోవిందం కిట్లు
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు దర్శనం, లడ్డూ కార్డులు
TTD
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిర్వహించే అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు ఉచితంగా కిట్లు అందించాలని నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే అక్షర గోవిందం కిట్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. బాసర సరస్వతీదేవి ఆలయంలో మాదిరిగానే వకుళామాత సన్నిధిలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు టీటీడీ ఈ అక్షర గోవిందం కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనుంది. త్వరలోనే పూర్తిస్తాయిలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు.
మూడు నుంచి ఐదేళ్ల వయసున్న చిన్నారులకు అక్షర గోవిందం కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం చేయించవచ్చు. అక్షరాభ్యాసం తర్వాత చిన్నారులకు ఏడు వస్తువులతో కూడిన కిట్ అందించాలని నిర్ణయించారు. ఇందులో పలకబలపం, అమ్మవారి కుంకుమ, శ్రీవారి అక్షింతలు, కంకణాలు, కలకండ, వినాయకుడు – సరస్వతీదేవి, వెంకటేశ్వరస్వామితో కూడిన ఫోటో ఉంటాయి. అయితే ఈ కిట్లను అక్షరాభ్యాసంలో పాల్గొనే పిల్లలకు ఉచితంగా ఇవ్వాలనిత తాజాగా జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటుగా తిరుమలలోని రహదారులు, కూడళ్లకు ఆధ్యాత్మిక, పురాణాలకు సంబంధించిన పేర్లు పెట్టాలని నిర్ణయించారు. తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుంచి బాటగంగమ్మ సర్కిల్ వరకూ స్పర్శదర్శనం క్యూలైన్లలో రూ.4.55 కోట్లతో అదనంగా మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు.
టీటీడీ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు..
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శ్రీవారి దర్శనం, లడ్డూ కార్డులు జారీ చేయాలని పాలకమండలి భేటీలో నిర్ణయించారు. హెల్త్ స్కీమ్లో భాగంగా 5 లక్షల వరకూ రీయింబర్స్ చేసుకునేందుకు ఆమోదం తెలిపారు. నవీ మంబైలోని శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ నేపథ్యంలో.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరాలని నిర్ణయించారు. టీటీడీ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాల కల్పనకు అదనంగా రూ.43.40 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు.
తిరుపతిలోని అలిపిరి వద్ద రూ.4.75 కోట్లతో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కోసం యాగశాల నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహిత డా.శోభారాజును టీటీడీ ఆస్థాన విద్వాన్గా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అనంతవరంలోని శ్రీవారి ఆలయంలో రూ.2.71 కోట్లతో రాజ గోపురం నిర్మాణం, అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీవారి ఆలయంలో రూ.36.95 కోట్లతో ఏడు అంతస్తుల మహా రాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్ధాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయస్వామి ఆలయం, పుష్కరిణి నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.