Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా..
Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా..
హైదరాబాద్లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. దివ్యారెడ్డి దొడ్ల అనే మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్లు 1.20 కోట్లు టోకరా వేశారు. ఫేక్ వాట్సాప్ అకౌంట్ నుంచి దివ్యారెడ్డి అకౌంటెంట్కు మెసేజ్ పంపించి మోసం చేశారు. తాను మీటింగ్లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించాలని ఆ మెసేజ్లో ఉండటంతో.. అకౌంటెంట్ అదే పనిచేశారు. అయితే మార్చి 17న మరోసారి ఇలాంటి మెసేజ్ రావటం.. ఈ విషయాన్ని అకౌంటెంట్.. దివ్యారెడ్డికి తెలియజేయటంతో మోసపోయిన విషయం అర్థమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Dodla divya Reddy cyber Fraud
మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా
రోజురోజుకూ సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయి. చదువుకోని వారితో పాటు.. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా టోకరా వేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఓ మహిళా వ్యాపారవేత్తను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. దొడ్ల ప్రతాప్ గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డి దొడ్లకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఏకంగా రూ.1.20 కోట్లు కాజేశారు. దివ్యారెడ్డి ప్రస్తుతం 18 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నారు. సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంటెంట్ను మోసం చేసి.. డబ్బులు కాజేశారు. ఈ నేపథ్యంలో దివ్యారెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులోని వివరాల ఆధారంగా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
మార్చి13వ తేదీన దివ్యా రెడ్డి పేరు, ఫొటో డీపీతో ఓ వాట్సాప్ అకౌంట్ నుంచి ఆమె అకౌంటెంట్కు మెసేజ్ వచ్చింది. తాను ప్రస్తుతం సమావేశంలో ఉన్నానని.. తాను చెప్పిన బ్యాంక్ అకౌంట్కు రూ.1.20 కోట్లు పంపాలని ఆ మెసేజ్ సారాంశం. నిజంగానే దివ్యా రెడ్డి నుంచి ఆ మెసేజ్ వచ్చిందని భావించిన అకౌంటెంట్.. మెసేజ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్కు డబ్బులు పంపించారు. అయితే డబ్బులు పంపాలంటూ మార్చి 17న అకౌంటెంట్కు మరోసారి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దీంతో అకౌంటెంట్ డబ్బులు పంపేందుకు చెక్ అప్రూవల్ కోసం దివ్యా రెడ్డిని సంప్రదించారు. ఈ క్రమంలోనే గతంలో పంపించిన రూ.1.20 కోట్ల లావాదేవీ గురించి చెప్పారు.
అయితే తాను ఎవరికీ డబ్బు పంపించమని చెప్పలేదని దివ్యారెడ్డి చెప్పటంతో అకౌంటెంట్ షాక్ తిన్నారు. ఆ తర్వాత జరిగిన మోసాన్ని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొడ్ల దివ్యారెడ్డి.. దొడ్ల ప్రతాప్ బిజినెస్ గ్రూపులోని పలు సంస్థలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. దొడ్ల డెయిరీ లిమిటెడ్, ప్రతాప్ రెజిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెప్పింగ్ స్టోన్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలలో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు కోటీ 20 లక్షల రూపాయల నగదు బదిలీ చేసిన అకౌంట్.. సౌతిండియన్ బ్యాంక్లోనిదిగా గుర్తించారు. లాబోరిస్ ఇంటీరియర్స్ పేరుతో బ్యాంక్ అకౌంట్ లింక్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.