సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ సజ్జనార్

 సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ సజ్జనార్

సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ సజ్జనార్

కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని.. సీపీ సజ్జనార్ సూచించారు. కొంతమంది వ్యాపారులు.. మామిడి పండ్లను తొందరగా పక్వానికి వచ్చేందుకు ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతీ మామిడి పండును మంచిది అని కొనుగోలు చేస్తే.. మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుందని సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు చేశారు.

CP Sajjanar

కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త.. సీపీ సజ్జనార్

ప్రస్తుతం వేసవి కాలం రావడంతో మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. పండ్లలో రారాజు అయిన మామిడి పండు పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మార్కెట్లో బంగారు వర్ణంతో.. చూస్తేనే తినాలనే విధంగా.. నిగనిగలాడే మామిడి పండ్లు.. బండ్లు, దుకాణాల్లో సందడి చేస్తున్నాయి. రకరకాల మామిడి పండ్లు అన్నీ మార్కెట్‌కు రావడంతో మ్యాంగో లవర్స్‌ ఆనందంలో మునిగిపోతున్నారు. అయితే ఇప్పుడు మామిడి పండ్ల ప్రియుల గుండె గుభేల్ మనే వార్త వచ్చింది. కొందరు కాసుల కక్కుర్తి ఉన్న వ్యాపారులు.. మామిడి పండ్లను రసాయనాలతో మగ్గించి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ విషయంపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా.. ప్రజలను అప్రమత్తం చేశారు. కల్తీ మామిడి పండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్ చేసి చెప్పాలని వెల్లడించారు.

వేసవి రాకతో పండ్లలో రారాజైన మామిడి పండ్లు మార్కెట్‌లో సందడి చేస్తోందని.. నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజ‌లు విస్మరించకూడదని సజ్జనార్ అలర్ట్ చేశారు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని.. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్‌, ఇతర ర‌సాయాల‌ను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారని తెలిపారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ.. పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమేనని సజ్జనార్ ట్వీట్ చేశారు.

సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు.. కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు మాత్రం పైన పసుపు పచ్చగా ఉండి.. లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ఇలాంటి రసాయనాలతో మగ్గించిన పండ్లను తినడం వల్ల గొంతులో మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలతో పాటు.. దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోందని సీపీ సజ్జనార్ వెల్లడించారు. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్‌-ఫాస్ట్ నిఘా ఉంచుతోందని.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పండ్ల రూపాన్ని చూసి ప్రజలు మోసపోకుండా.. వాటి సహజత్వాన్ని గుర్తించి కొనుగోలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.

సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. మామిడి పండ్లపై అసాధారణంగా మచ్చలు ఉన్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలని తెలిపారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ.. హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబ‌ర్ 8712661212కు స‌మాచారం ఇవ్వాలని సజ్జనార్ ప్రజలకు వెల్లడించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *