విజయసాయిరెడ్డి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నా: రఘురామకృష్ణరాజు
విజయసాయిరెడ్డి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నా: రఘురామకృష్ణరాజు
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు, శత్రుత్వం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘురామకృష్ణరాజు పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం తాను విజయసాయిరెడ్డి ఇంటిలోనే అద్దెకు ఉంటున్నట్లు వెల్లడించారు. ఇక మంత్రి పదవి రాకపోవటంపైనా రఘురామ స్పందించారు. మంత్రి పదవి రానందుకు అసంతృప్తి ఏమీ లేదని.. కాకపోతే గతంలో మాట్లాడినంత స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మాట్లాడటం కుదరదని చెప్పుకొచ్చారు.
Raghu rama
విజయసాయిరెడ్డి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నా: రఘురామకృష్ణరాజు
మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఓ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘురామకృష్ణరాజు.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. విజయసాయిరెడ్డి తో తనకు శత్రుత్వం లేదని.. స్నేహభావం ఉందని తాను అనుకుంటున్నానని రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఇంటిలోనే తాను అద్దెకు ఉంటున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి పక్కనే ఓ 50 ఇళ్లు కట్టారని.. అందులోనే విజయసాయిరెడ్డికి ఇల్లు ఉందన్నారు రఘురామ. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి విడిపోయిన తర్వాత.. తాను ఆదిశేషగిరిరావును ఇల్లు అద్దెకు ఉంటే చెప్పమని అడిగానని, అప్పుడే ఆయన తనకు విజయసాయిరెడ్డి ఇంటి గురించి చెప్పారన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడతానని ఆదిశేషగిరిరావు తనతో చెప్పినట్లు తెలిపారు.
దానికి విజయసాయిరెడ్డికి అభ్యంతరం లేకపోతే తీసుకోవడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పినట్లు రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఆ తర్వాత తాను విజయసాయిరెడ్డి ఇంట్లో అద్దెకు దిగానని.. అందుకు ఫోన్ చేసి విజయసాయిరెడ్డికి ధన్యవాదాలు చెప్పినట్లు రఘురామకృష్ణరాజు వివరించారు. గతంలో తనకు, విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్ల వార్ జరిగిందన్న రఘురామకృష్ణరాజు.. విజయసాయిరెడ్డి బదులుగా ఆయన పేరుతో వేరే వ్యక్తి ట్వీట్లు పెట్టేవారని ఆ తర్వాత తెలిసిందన్నారు. అయినప్పటికీ ఖండించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో.. వాటిని ఖండిస్తూ ట్వీట్లు పెట్టినట్లు వివరించారు. ఆ తర్వాత చాలాసార్లు విజయసాయిరెడ్డి, తానూ కలిశామని, చాలా ఆప్యాయంగా మాట్లాడారని తెలిపారు.
మరోవైపు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి తనకు లేదని రఘురామకృష్ణరాజు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైనదన్న రఘురామకృష్ణరాజు.. అయితే మీడియాతో గతంలోలాగా మాట్లాడిన తీరుగా ప్రస్తుతం మాట్లాడలేమన్నారు. ఐదేళ్లు మీడియాతో సన్నిహితంగా ఉండి, ఇప్పుడు దూరంగా ఉండాల్సి రావటమే కాస్త ఇబ్బంది అని తెలిపారు.
మరోవైపు గతంలో రచ్చబండ పేరుతో రఘురామకృష్ణరాజు మీడియా సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే ఎన్నికల సమయంలో ఆఖరి నిమిషంలో రఘురామకు టికెట్ ఖరారైంది. ఉండి నియోజకవర్గం అభ్యర్థిని అప్పటికే ప్రకటించిన చంద్రబాబు.. రఘురామ టీడీపీలోకి రావటంతో ఆ సీటును రఘురామకృష్ణరాజుకు కేటాయించారు. కూటమి గెలవటంతో రఘురామకు మంత్రి పదవి ఇస్తారనే వార్తలు వచ్చినప్పటికీ.. డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టారు.