‘నా సొంత భూమిని కేటీఆర్ వదల్లేదు, ఎవరికీ చెప్పుకోలేకపోయాం’.. దానం నాగేందర్ ఆరోపణలు
‘నా సొంత భూమిని కేటీఆర్ వదల్లేదు, ఎవరికీ చెప్పుకోలేకపోయాం’.. దానం నాగేందర్ ఆరోపణలు
అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ను ఉద్దేశించి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేల ఎకరాల భూమి కబ్జాలకు గురైందని ఆరోపించారు. ఇక తన సొంత భూమిని కూడా కేటీఆర్ ఆక్రమించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ భూమిని కేటీఆర్ ప్రైవేటు కంపెనీలకు అప్పగించారని.. అయినప్పటికీ తాను ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
Danam Nagender
భూ ఆక్రమణలపై కేటీఆర్పై దానం ఆరోపణలు
తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో తన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ .. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో మైనింగ్ మంటలు రాజేశాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మైనింగ్, ఇసుక అక్రమ రవాణాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ క్రమంలోనే ఆదివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్పై.. ఖైరతాబాద్ ఎమ్యెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో వేల ఎకరాల భూ కుంభకోణం జరిగినట్లు దానం నాగేందర్ ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా కేటీఆర్.. తమ సొంత భూమిని కూడా కేటీఆర్ వదలకుండా కబ్జా చేశారని ఆరోపించారు. కేటీఆర్ చేసిన పనికి తమ బాధలను ఎవరికీ చెప్పుకోలేక గతంలో తాము నోరు మూసుకుని కూర్చున్నామని సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి కష్టపడి సంపాదించిన తమ సొంత భూమిని కూడా కేటీఆర్ ఒక ప్రైవేట్ కంపెనికీ అప్పగించినట్లు దానం నాగేందర్ పేర్కొన్నారు.
తాము హైదరాబాద్లో పుట్టి పెరిగామని.. అయినప్పటికీ తాము మౌనంగా ఉండిపోవాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడిందని దానం నాగేందర్ వెల్లడించారు. ఈ విషయంలో తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. కావాలంటే రికార్డులు కూడా చూపిస్తానని చెప్పారు. తాము ఎంత నష్టపోయాము అనేది తమకు మాత్రమే తెలుసని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో తమ బాధలు ఎవరికీ చెప్పుకోలేకపోయామని దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూకుంభకోణాలపై హౌస్ కమిటీ వేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.