సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పరకాల వివాదం తర్వాత ఆసక్తికర పరిణామం
సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పరకాల వివాదం తర్వాత ఆసక్తికర పరిణామం
Minister Konda Surekha Ties Rakhi To CM Revanth Reddy: మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మంత్రి సీతక్కతో కలిసి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు.. అనంతరం ఏమీ మాట్లాడకుండానే అ క్కడి నుంచి వెళ్లిపోయారు. కొండా సుస్మిత, పరకాల వివాదం తర్వాత మంత్రి కొండా సురేఖ సీఎంను కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రేవంత్ రెడ్డికి రాఖీ కట్టానని.. పండగ రోజు రాజకీయాల గురించి మాట్లాడనన్నారు కొండా సురేఖ.
హైలైట్:
- సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి సురేఖ
- సీతక్కతో కలిసి రేవంత్కు రాఖీ కట్టిన కొండా సురేఖ
- రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పిన మంత్రి

కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఎపిసోడ్లో ఏం జరిగింది?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ములుగు, పరకాల పర్యటనకు వెళ్లగా.. మంత్రి కొండా సురేఖ ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డితో ఉన్న విభేదాలతో మంత్రి సీఎం టూర్కు వెళ్లలేదని చర్చ జరిగింది. పరకాల పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్రెడ్డిని భారీ ఆధిక్యతతో గెలిపించాలని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా రేవూరికి టికెట్ అన్నట్లుగా సంకేతాలు వెళ్లడంతో ఆ మరుసటి రోజు మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత గీసుకొండలో సీఎం రేవంత్ రెడ్డి , పరకాల ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీచేస్తానని సుస్మిత ప్రకటించారు.
సుస్మిత నేరుగా ముఖ్యమంత్రిపై విమర్శలు, ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. అనంతరం సుస్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసు ఇచ్చింది. మంత్రి కూడా తన కుమార్తె చేసిన ఆరోపణలకు తానెలా బాధ్యురాలినంటూ ఆ నోటీసుకు సమాధానం ఇచ్చారు. అయితే ఈ అంశంపై క్రమశిక్షణా కమిటీ రిపోర్ట్ ఇవ్వగా.. మంత్రి సురేఖపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ వెళ్లడం ఆసక్తికరంగా మారింది.