నాగోబా ఆలయానికి మహర్దశ.. ఆదివాసీల ఆరాధ్య దైవానికి సర్కార్ కానుక, రూ.20.10 కోట్లు మంజూరు
నాగోబా ఆలయానికి మహర్దశ.. ఆదివాసీల ఆరాధ్య దైవానికి సర్కార్ కానుక, రూ.20.10 కోట్లు మంజూరు
తెలంగాణలో రెండో అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చొరవతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా ఆలయ సుందరీకరణ, ఆదివాసీ సంస్కృతిని తెలిపే మ్యూజియం, డార్మెటరీలు మరియు బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిధులతో నాగోబా క్షేత్రం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకపరంగానూ అభివృద్ధి చెందనుంది.
హైలైట్:
నాగోబా ఆలయానికి మహర్దశ
ఆదివాసీల ఆరాధ్య దైవానికి సర్కార్ కానుక
అభివృద్ధి కోసం రూ.20.10 కోట్లు మంజూరు
Nagoba Temple Development
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా ఆలయం త్వరలో సరికొత్త రూపురేఖలను
సంతరించుకోనుంది. సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందిన ఈ క్షేత్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. అడవి బిడ్డల ఆరాధ్య దైవం నాగోబా ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి పర్చేలా రేవంత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలయాభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం రహదారుల నిర్మాణం కోసం మెుత్తంగా రూ.20.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రతి ఏడాది మెస్రం వంశస్థుల ఆధ్వర్యంలో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నాగోబా జాతరను ఆదివాసీబిడ్డలు నిర్వహిస్తారు. ఈ వేడుకకు ఉమ్మడి రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి ఆదివాసీలు వస్తుంటారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక.. ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండగగా కూడా గుర్తించింది. జాతరలో అధికారికంగా మంత్రులచే దర్బార్ నిర్వహించి గిరిజన సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు చేపట్టడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో నాగోబా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆదివాసీలు గత కొన్నేళ్లుగా విన్నవిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది జరిగిన నాగోబా జాతరలోనూ అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించారు. గతంలో ఇంద్రవెల్లిని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించినప్పుడు స్థానిక ఎమ్మెల్యే వెడ్మబొజ్జు నాగోబా ఆలయ అభివృద్ధి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి సర్కార్కు పంపించారు. దీంతో సర్కార్ తాజాగా నిధులు మంజూరు చేసింది.
ప్రణాళికల్లో భాగంగా.. రూ.15.30 కోట్లతో నాగోబా ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఆలయ ఆవరణలో ఆదివాసీల ఆధ్యాత్మిక, సంస్కృతి ప్రతిబింబించేలా రూ.80 లక్షలతో ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేస్తారు. రూ.80 లక్షలతో పెద్ద నీటి ట్యాంకు నిర్మాణం, డార్మెటరీ, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయంలో ఆధునిక లైట్లు, అధిక వెలుతురునిచ్చే హైమాస్ట్ లైట్లు, పరిసరాలలో గ్రీనరీ, మొక్కల పెంపకం చేపట్టనున్నారు. రూ.4 కోట్లతో కేస్లాపూర్, నాగోబా ఆలయం వరకు బీటీ రోడ్లు, కాలువల నిర్మాణం చేయనున్నారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభించనుండగా.. వచ్చే జాతర నాటికి సింహభాగం పనులు పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోనున్నారు.