దేవుడి హుండీలో నకిలీ నోట్లు.. కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్‌లో ఘటన

 దేవుడి హుండీలో నకిలీ నోట్లు.. కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్‌లో ఘటన

దేవుడి హుండీలో నకిలీ నోట్లు.. కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్‌లో ఘటన

ఆలయ హుండీ లెక్కింపు చేపట్టిన అధికారులు షాక్ అయ్యే సంఘటన చోటు చేసుకుంది. హుండీలో ఉన్న డబ్బులు లెక్కిస్తుండగా.. అందులో కొన్ని నోట్లు చూసి.. వారు అవాక్కయ్యారు. ఎందుకంటే అవి నకిలీ నోట్లు అని వారు గుర్తించారు. అదెక్కడో కాదు హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో ఉన్న హనుమాన్ ఆలయంలోనే. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

Fake Notes

దేవుడి హుండీలో నకిలీ నోట్లు

మనం ఏ గుడికి వెళ్లినా.. దేవుడ్ని దర్శనం చేసుకోవడంతోపాటు అక్కడ ఏర్పాటు చేసిన హుండీలో ఎంతో కొంత డబ్బులు వేస్తూ ఉంటాం. ధనవంతులు ఎక్కువ డబ్బులు హుండీలో వేస్తే.. సామాన్యులు తక్కువలో తక్కువ రూ.10, రూ.20 వేస్తూ ఉంటారు. కొందరు తాము చేసిన పాపాలను హుండీలో డబ్బులు వేసి దులుపుకుంటారు అని అంటుంటే.. భక్తితో దేవుడి కోసం ఎంతో కొంత ఇచ్చామని మరికొందరు భావిస్తూ ఉంటారు. అయితే హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలోని దేవుడి హుండీలో నకిలీ నోట్లు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది.

సాధారణంగానే ఇటీవల కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో ఆలయ అధికారులు హుండీ లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. భక్తులు హుండీల్లో వేసిన నోట్లు, నాణేలు, బంగారం, వెండి సహా ఇతర విలువైన వస్తువులను తీసి.. లెక్కిస్తుండగా ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన విరాళాల్లో నకిలీ నోట్లు ఉన్నట్లు ఆలయ అధికారులు గుర్తించారు.

చూడడానికి నిజమైన కరెన్సీ నోట్ల లాగే ఉన్న ఆ నోట్లను ఆలయ అధికారులు పరీక్షించి చూడగా.. అవి నకిలీ నోట్లు అని తేలింది. Childrens Bank పేరుతో ఉన్న ఆ నోట్లను.. నిజమైన కరెన్సీ నోట్లతో కలిపి హుండీలో వేసినట్లు పేర్కొన్నారు. రూ.100, రూ.200, రూ.500 వంటి ఫేక్ నోట్లను భక్తులు సమర్పించినట్లు గుర్తించారు. అయితే హుండీలో నకిలీ నోట్లు వేయడం పట్ల హనుమాన్ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవిత్రమైన దేవాలయాల్లో కూడా ఇలాంటి నకిలీ పనులు జరగడం తీవ్ర బాధాకరమని పేర్కొంటున్నారు. మొక్కులు తీర్చుకునే ఆలయ హుండీలో ఇలాంటి నకిలీ నోట్లు వేయడం అంటే దేవాలయ పవిత్రతను దిగజార్చటమేనని మండిపడుతున్నారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ అధికారులు.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయ పరిధిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను మరింత పెంచనున్నట్లు వెల్లడించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *