మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు.. TDP ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు.. TDP ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కు సైతం డ్రగ్స్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శనివారం నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఇవాళ ఉదయం మరోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీలో వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఎంపీపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
హైలైట్:
మెయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక మలుపు
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్
వెల్లడించిన ఈగల్ ఎస్పీ గిరిధర్
Moinabad Drug Case
రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి సహా.. ఐదుగురికి డ్రగ్స్ పరీక్షల్లో పాటిజివ్ రాగా.. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్కు డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఈగల్ ఎస్పీ గిరిధర్ అధికారికంగా వెల్లడించారు. శనివారం రాత్రి నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఎంపీకి నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఆదివారం నిర్వహించిన తదుపరి పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని ఎస్పీ తెలిపారు. శరీర మెటబాలిజం కారణంగా ఫలితాల్లో ఈ మార్పు వచ్చినట్లు ఎస్పీ వివరించారు. నిందితులు సిమ్లా నుండి డ్రగ్స్ తీసుకువచ్చి వినియోగించినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ఎంతటి వారైనా.. ఎంపీ, ఎమ్మెల్యే ఎవరున్నా సరే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు.
ఏం జరిగిందంటే..?
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఆజీజ్నగర్లోని ఫైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాం హౌస్లో శనివారం రాత్రి అనుమతి లేకుండా భారీ మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. రాత్రి 9.30 గంటలకు ఈగల్ టీమ్, ఎస్వోటీ, స్థానిక పోలీసులు ఫాంహౌస్పై దాడులు నిర్వహించారు. పోలీసులను చూడగానే భయంతో ఢిల్లీకి చెందిన వ్యాపారి నమీద్ మిశ్రా ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ తుపాకీ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డిదిగా గుర్తించారు. ఈ పార్టీలో మొత్తం 11 మంది ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి సహా పలువురు వ్యాపారవేత్తలు, ఒక మహిళ పోలీసులకు చిక్కారు.
ప్రాథమిక పరీక్షల్లో రోహిత్ రెడ్డి, నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ రాగా.. తాజా పరీక్షల్లో ఎంపీ పుట్టా మహేష్కు కూడా పాజిటివ్ అని తేలింది. వీరంతా వారం క్రితం సిమ్లా, గోవా పర్యటనల్లో డ్రగ్స్ సేవించినట్లు తెలుస్తోంది. ఫాంహౌస్లో 2 గ్రాముల కొకైన్ పౌడర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు శాంపిల్స్ను ఎఫ్ఎస్ఎల్ పరీక్షలకు పంపారు. నిందితులందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుపడటం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఓ వైపు ప్రభుత్వాలు డ్రగ్స్ వ్యతిరేక పోరాటాలు చేస్తుంటే.. ప్రజా ప్రతినిధులే డ్రగ్స్ తీసుకోవటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.