కాకినాడ: మనిషిని చంపేసిన కోతులు.. 20 వానరాలు ఒక్కసారిగా దాడి చేసి..

 కాకినాడ: మనిషిని చంపేసిన కోతులు.. 20 వానరాలు ఒక్కసారిగా దాడి చేసి..

కాకినాడ: మనిషిని చంపేసిన కోతులు.. 20 వానరాలు ఒక్కసారిగా దాడి చేసి..

కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో కోతుల మూక దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఒకేసారి 20కి పైగా కోతులు మీదపడి దాడి చేయటంతో చిన్న బుల్లి అనే 68 ఏళ్ల మహిళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు కోతుల బెడద తప్పించాలని ఊరి జనం కోరుతున్నారు. తమ ప్రాంతంలో కోతుల దాడులు ఎక్కువయ్యాయని.. ఇప్పుడు ఏకంగా మనిషి ప్రాణాలు తీసేవరకూ వెళ్లాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Monkey attack

కాకినాడ కోతుల దాడిలో వృద్ధురాలి మృతి

వానరం.. అంటే ఆంజనేయుడి స్వరూపంగా భావించేవారు మనలో చాలా మంది ఉన్నారు. అయితే అది చేసే పనులను కోతి చేష్టలని వెక్కిరించేవారూ ఉన్నారు. ఈ అభిప్రాయాలు, నమ్మకాల మాటెలా ఉన్నా.. కోతులు చేసే అరాచకాలు రోజు రోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. నిన్నామొన్నటి దాకా పంటపొలాలపై దాడులు చేస్తూ రైతులను ఇబ్బందులు పెట్టిన కోతులు.. ఇప్పుడు ఏకంగా ఇళ్లపైనే పడుతున్నాయి. మనుషులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే కోతుల దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని పెద్దిపాలెంలో కోతుల మూక దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

గ్రామస్థులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దానబోయి చిన్నబుల్లి అనే 68 ఏళ్ల మహిళ.. పెద్దిపాలెం గ్రామ శివారులోని జీడిమామిడి తోట సమీపంలో ఓ ఇంట్లో ఉంటున్నారు. తన మూడు ఎకరాల తోటలో కూతురి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అయితే శనివారం రోజున చిన్నబుల్లి.. తమ గేదెకు నీరు పెట్టేందుకు వెళ్లిన సమయంలో.. అక్కడ ఉన్న కోతులు ఆమెపై దాడి చేశాయి. సుమారుగా 20 కోతులు ఒకేసారి ఆమెపై పడ్డాయి. దీంతో పాపం ఆ వృద్ధురాలికి తప్పించుకునే వీలు లేకుండా పోయింది. దీంతో కోతుల మూక దాడిలో చిన్న బుల్లి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువని స్థానికులు చెప్తున్నారు. కోతులు మీద పడి దాడి చేసిన ఘటనలు అనేకం ఉన్నాయని.. అయితే ప్రాణాలు తీయటం మాత్రం ఇదే తొలిసారని చెప్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని తమకు ఈ కోతుల బెడద నుంచి తప్పించాలని కోరుతున్నారు.

మరోవైపు ఎండాకాలంలో కోతుల బెడద మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆహారం, నీరు దొరకని పరిస్థితులలో.. అవి జనావాసాలపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కోతుల సమస్య మరింత అధికంగా ఉంది. రైతులు పండించిన పంటలను ధ్వంసం చేస్తూ.. అన్నదాతలకు ఆర్థికంగా నష్టం చేకూరుస్తున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఇళ్లల్లోకి ప్రవేశించి, సరకులు, సామాన్లను నాశనం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కోతుల బెడద నుంచి తప్పించేందుకు రైతులు వినూత్న ఆలోచనలు చేస్తున్న ఘటనలు.. అప్పుడప్పుడూ చూస్తుంటాం.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *