‘నేనే ట్రెండింగ్ స్టార్.. అవసరమయితే సినిమా తీస్తా’: మల్లారెడ్డి
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు. సోషల్ మీడియాలో తన క్రేజ్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తానే ట్రెండింగ్ స్టార్ అని అన్నారు. సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తోంది తానేనని చమత్కరించారు. సినిమా అవకాశాలపై స్పందిస్తూ.. ఎవరో ఛాన్స్ ఇవ్వడం ఏంటని, తనకు సినిమా చేయాలనిపిస్తే తానే స్వయంగా నిర్మించి నటిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
హైలైట్:
ఇప్పుడు నేనే ట్రెండింగ్ స్టార్
అవసరమయితే సినిమా తీస్తా
మాజీ మంత్రి మల్లారెడ్డి
MLA Malla Reddy
మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో మాములుగా ఉండదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. ఇటీవల 50వ వివాహా వార్షికోత్సవం నిర్వహించుకున్న ఆయన.. డ్యాన్స్తో అదరగొట్టారు. తాజాగా బడ్జెట్ సమావేశాల వేళ అసెంబ్లీ లాబీలో సందడి చేశారు. సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు తానే ట్రెండింగ్ స్టార్ అని అన్నారు. సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తుందే తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాంతో పాటు సినిమాల్లో నటించే అవకాశం గురించి కూడా కీలక కామెంట్స్ చేశారు. తనకు సినిమా అవకాశం ఒకరు ఇచ్చేది ఏంటి..? నేనే స్టారని అని అన్నారు. ఒకవేళ సినిమానే చేయాలనిపిస్తే.. ఎవరి కోసమో వేచి చూడనని.. అవసరం అయితే తానే సినిమా తీస్తానని స్పష్టం చేశారు.
ఇక మాల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కారు దిగి హస్తం పార్టీలో చేరుతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. గతంలో ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్తో భేటీ కావటంతో ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై మల్లారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. అవన్నీ అసత్యాలేనని కొట్టిపారేశారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసునని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన సోమవారం మీడియాతో చిట్చాట్ మట్లాడారు.
‘ప్రస్తుతం నా వయసు 73 ఏళ్లు. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మునిగిపోయే పడవలో ఎవరైనా ఎక్కుతారా? కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిది. రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ 11 ఏళ్లు కాదు 50 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ.. అది మునిగిపోయే పడవే. క్షేత్రస్థాయిలో ఏ పార్టీ బలంగా ఉందో అందరికీ తెలుసు.’ అని మల్లారెడ్డి వెల్లడించారు. ఇక మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి కూడా పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారు. త్వరలోనే ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.