Sabarimala: శబరిమల భక్తులకు అలర్ట్.. రైల్వే శాఖ కీలక సూచనలు

రైళ్లలో పూజలు నిర్వహించవద్దని దక్షిణ మధ్య రైల్వే శాఖ శబరిమల భక్తులకు కీలక సూచనలు చేసింది. కోచ్లో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం వంటివి చేస్తే సెక్షన్లోని 67, 154, 164, 165 ప్రకారం మూడేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని తెలిపింది.
శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. కొందరు రైళ్లలో పూజలు చేస్తున్నారని ఇలా చేయకూడదని తెలిపింది. రైళ్ల కోచ్లో భక్తులు కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి పెట్టడం వంటివి చేయవద్దని కోరింది. రైళ్లలో ఇలాంటి పూజలు నిర్వహించడం వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం అని తెలిపింది..
ఇలా చేయడం వల్ల రైల్వే ఆస్తులకు కూడా నష్టం కలిగించినట్లు అవుతుందని తెలిపింది. ఇలా చేస్తే రైల్వే చట్టంలోని 1989 సెక్షన్లోని 67, 154, 164, 165 ప్రకారం నేరంగా భావించి శిక్ష విధిస్తారని తెలిపింది. మూడు ఏళ్ల పాటు జైలు శిక్ష విధించడంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది.
శబరిమల భక్తుల సౌకర్యం మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాకినాడ, కాచిగూడ, తిరుపతి, నాందేడ్ వంటి స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చింది. ప్రతీ ప్రయాణికుడు తిరిగి గమ్యస్థానానికి చేరుకోవాలంటే ఇలాంటి పనులు రైళ్లలో చేయకూడదని తెలిపింది.