Pollution Control Board: డేంజర్లో హైదరాబాద్.. ఇక్కడ బతకడం ఇక కష్టమేనా?
గతంలో నగరంలో 7 కాలుష్య హాట్స్పాట్లను గుర్తించగా, ప్రస్తుతం ఆ పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ముఖ్యంగా పీఎం-10 ధూళి కణాలు WHO నిర్దేశించిన 40 మైక్రోగ్రాముల పరిమితికి రెట్టింపు స్థాయిలో, అంటే 82 నుంచి 88 మైక్రోగ్రాముల వరకు నమోదవుతున్నాయి.
Air Pollution:హైదరాబాద్ మహానగరంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయి(hyderabad pollution level) కి చేరుకుంటోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (PCB(pollution-control-board)) వెల్లడించిన గణాంకాల ప్రకారం, గాలి నాణ్యత విషయంలో హైదరాబాద్ ఇప్పుడు పొరుగున ఉన్న బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలను కూడా అధిగమించింది. గతంలో నగరంలో 7 కాలుష్య హాట్స్పాట్లను గుర్తించగా, ప్రస్తుతం ఆ పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ముఖ్యంగా పీఎం-10 ధూళి కణాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన 40 మైక్రోగ్రాముల పరిమితికి రెట్టింపు స్థాయిలో, అంటే 82 నుంచి 88 మైక్రోగ్రాముల వరకు నమోదవుతున్నాయి.
తాజాగా గాజులరామారం ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (AQI) ఉదయం పూట ఏకంగా 394గా నమోదవ్వడం నగరవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా 300 దాటితే అది ‘అత్యంత ప్రమాదకర’ స్థాయిగా పరిగణించబడుతుంది. ఐఐటీ కాన్పూర్ చేసిన అధ్యయనం ప్రకారం.. ఖైరతాబాద్-కోఠి, జీడిమెట్ల, బీహెచ్ఈఎల్-అమీర్పేట, నాంపల్లి-చార్మినార్, మెహిదీపట్నం-హైటెక్సిటీ, సికింద్రాబాద్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాలు ప్రధాన కాలుష్య కేంద్రాలుగా మారాయి. వాహనాల రద్దీ, నిర్మాణ రంగానికి సంబంధించిన ధూళి, మరియు పారిశ్రామిక ఉద్గారాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలని అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఢిల్లీ వంటి నగరాలతో పోలిస్తే కొంత నయం అనిపించినా, దక్షిణాదిలో అత్యంత కాలుష్య నగరంగా హైదరాబాద్ నిలవడం గమనార్హం. ఏడాది పొడవునా ఒక్క రోజు కూడా నగరంలో ‘స్వచ్ఛమైన గాలి’ (Good Air Quality) నమోదు కాకపోవడం గమనార్హం. గాలి నాణ్యత ఇలాగే క్షీణిస్తే ప్రజల జీవితకాలం దాదాపు 3.6 ఏళ్ల మేర తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో భాగ్యనగరం శ్వాస తీసుకోవడానికే వీలులేని నగరంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.