Nadendla Manohar Arrest : విశాఖలో నాదెండ్ల మనోహర్ అరెస్ట్, పోరాటానికి సిద్ధమన్న పవన్ కల్యాణ్
Nadendla Manohar Arrest : విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేయడంపై జనసేన నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నాదెండ్ల అరెస్టును పవన్ కల్యాణ్ ఖండించారు.
Nadendla Manohar Arrest : ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే.. వాటి కోసం విపక్షాలు పోరాడాల్సిన విచిత్ర పరిస్థితి ఏపీలో ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విశాఖ వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ జంక్షన్ ను మూసివేసి, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తెచ్చి పెట్టిన ప్రభుత్వం ఎవరి కోసం నాటకం ఆడుతుందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు వాస్తు దోషాలు ఉండటంతో టైకూన్ జంక్షన్ మూసివేశారని ఆయన ఆరోపించారు. దీనిపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సోమవారం టైకూన్ కూడలి వద్దకు బయలుదేరిన నాదెండ్ల మనోహర్ ను నోవాటెల్ హోటల్ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అరెస్టు చేశారు.
సోమవారం ఉదయం 9 గంటలకే హోటల్ వద్దకు చేరుకున్న నాదెండ్ల మనోహర్ ను కనీసం రూమ్ నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారని జనసేన నేతలు ఆరోపించారు. పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ మూర్తి ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్సైలతో భారీగా పోలీస్ బందోబస్తు హోటల్ వద్దకు చేరుకున్నారన్నారు. రూమ్ నుంచి బయటకు రావద్దంటూ పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలకు ఉన్న ఇబ్బందులు వివరిస్తూనే నాదెండ్ల మనోహర్ హోటల్ కిందికి వచ్చారు.
పై నుంచి ఆదేశాలు, వెళ్లనీయం- విశాఖ పోలీసులు
హోటల్ ముందు మరోసారి నాదెండ్ల మనోహర్ పాటు పార్టీ నాయకులను బయటకు వెళ్లనీయకుండా గేట్లు వేసి పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఫుట్ పాత్ మీద అయినా ప్రజా సమస్యపై నిరసన తెలుపుతామని మనోహర్ అసిస్టెంట్ కమిషనర్ కు వివరించినా పోలీసులు అందుకు అంగీకరించలేదని జనసేన నేతలు తెలిపారు. ఉన్నతాధికారులు, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాము ఏం చేయలేమని శాంతియుతంగా కూడా నిరసన తెలపవద్దని పోలీసులు చెప్పడంతో నాదెండ్ల మనోహర్ హోటల్ వద్ద నిరసన తెలిపారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా- నాదెండ్ల మనోహర్
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదని వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం అత్యంత దారుణం అన్నారు. ఎంపీ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వ్యవస్థలను ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉపయోగించుకుంటుందో అర్థమవుతుందన్నారు. ఎంపీ ప్రైవేట్ వెంచర్ ను కాపాడేందుకు అన్ని విధాలా ఆరాటపడుతున్నారని ఆరోపించారు. విశాఖలోని లక్షలాది మందికి ఎంతో అవసరమైన కూడలిని మూసివేసి, రెండు కిలోమీటర్ల దూరం పెంచి చుట్టూ తిరిగి రావాలనేలా ప్రజల సమయంతో ప్రభుత్వ పెద్దలు ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఎంపీ నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వాస్తు దోషం వస్తే పూర్తిగా ఆ రోడ్డునే మూసి వేయడం ఈ ప్రభుత్వ నియంత విధానానికి ప్రత్యక్ష తార్కాణం అన్నారు. ఇప్పటికే జనసేన పార్టీ ఈ సమస్యపై నాలుగుసార్లు నిరసన తెలిపినా అధికారుల నుంచి ఏ మాత్రం స్పందన రాలేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితే అడ్డుకోమని పోలీసులతో చెప్పింది ఎవరు? విశాఖ వచ్చిన ప్రతిసారీ పోలీసులతో నిర్బంధకాండ కొనసాగిస్తున్న ప్రభుత్వం తన అప్రజాస్వామిక పంథా వీడే వరకు పోరాటం చేస్తామన్నారు. మూడు నెలల్లో మారిపోయే ఈ ప్రభుత్వం మాటలను వినాల్సిన అవసరం లేదని అధికారులు కూడా గుర్తుంచుకోవాలన్నారు. టైకూన్ కూడలి సమస్య తీరే వరకు జనసేన పార్టీ పోరాడుతుందన్నారు.
నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం- పవన్ కల్యాణ్
విశాఖలోని టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసి వేయడం ఏమిటి? ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తోందన్నారు. అందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నామన్నారు. నాదెండ్ల మనోహర్ ను, జనసేన నేతలను తక్షణమే విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తానని, ప్రజల తరఫున పోరాడతానన్నారు.