Michaung Cyclone : రేపు కోస్తా తీరానికి సమాంతరంగా తుపాను- మూడ్రోజులు ఏపీలో భారీ వర్షాలు
Michaung Cyclone : మిచౌంగ్ తుపాను రేపు కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తుందని, ఎల్లుండి మధ్యాహ్నం తీరం దాటనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Michaung Cyclone : మిచౌంగ్ తుపాను నైరుతి బంగాళాఖాతంలో వాయవ్య దిశగా కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తుపాను రేపు(సోమవారం) కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని తెలిపింది. ఎల్లుండి మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య మిచౌంగ్ తీవ్ర తుపానుగా మారి తీరం దాటనుంది. తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి కూడా కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడనున్నాయి. బుధవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
రేపు ఉదయం తీరం వెంబడి గంటకు 80 -100 కిమీ, సాయంత్రం నుంచి గంటకు 90-110 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది. రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, విపత్తుల సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ నిరంతరం తుఫాను గమనాన్ని పర్యవేక్షిస్తున్నారు. విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు సూచనలు చేస్తున్నారు. విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కోడానికి సిద్ధంగా యంత్రాంగం సంయమనం చేస్తున్నారు. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం 4 ఎన్డీఆర్ఎఫ్ , 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసింది.
తుపాను హెచ్చరిక మేసేజ్ లు
క్షేత్రస్థాయిలో ప్రజలకు తుపాను హెచ్చరిక మేసేజ్ లను పంపించారు. ప్రజలు అత్యవసర సహాయం, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.