Ganesh Chaturthi 2025: ప్రతిష్ట కాకముందే గణేశుడి నిమజ్జనం.. హైదరాబాద్లో అపశృతి.. అసలేమైందంటే?
ఘట్కేసర్ నుంచి గణపతి విగ్రహాన్ని లారీలో హిమాయత్నగర్లోని అపార్ట్మెంట్కు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో రోడ్డు నంబర్ 5 వద్ద మలుపు తిరుగుతుండగా.. విగ్రహం తల భాగం విద్యుత్ తీగలకు, కేబుళ్లకు తగిలింది. దీంతో విగ్రహం లారీపై నుంచి రోడ్డుపై పడిపోయింది.
వినాయక చవితి వేడుకలు(Vinayaka Chavithi Celebrations) దగ్గర పడుతున్న తరుణంలో నగరంలో ఓ గణపతి విగ్రహం(Ganesh Idol) ముందుగానే నిమజ్జనానికి గురైంది. దోమలకూడా ప్రాంతానికి చెందిన కొందరు యువకులు తమ మండపం కోసం తీసుకొచ్చిన భారీ వినాయక విగ్రహం రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైంది. ఈ ఘటనతో మండపం నిర్వాహకులకు, భక్తులకు తీవ్ర నిరాశ ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. యువకులు ఘట్కేసర్లో కొనుగోలు చేసిన గణపతి విగ్రహాన్ని లారీలో హిమాయత్నగర్లోని తమ అపార్ట్మెంట్కు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో రోడ్డు నంబర్ 5 వద్ద ఒక మలుపు తిరుగుతుండగా.. విగ్రహం తల భాగం విద్యుత్ తీగలకు, కేబుళ్లకు తగిలింది. దీంతో విగ్రహం అదుపుతప్పి లారీపై నుంచి రోడ్డుపై పడిపోయింది.
ఈ ప్రమాదంలో విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. కష్టపడి తీసుకొచ్చిన విగ్రహం కళ్లముందే ధ్వంసం కావడంతో యువకులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నిర్వాహకులు వెంటనే క్రేన్ సహాయంతో ధ్వంసమైన విగ్రహాన్ని పీపుల్స్ ప్లాజా వద్ద హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. ఈ ఘటనలో లారీలో ఉన్న 25 ఏళ్ల గోల్మర్ అనే యువకుడు కింద పడడంతో ఎడమ కాలుకు గాయమైంది. అలాగే.. మూడు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటన భక్తులలో తీవ్ర చర్చకు దారితీసింది. గణేష్ విగ్రహాలను తరలించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో ఈ ప్రమాదం మరోసారి గుర్తు చేసింది.
భారీ విగ్రహాలను తరలించేటప్పుడు రోడ్డు మార్గాన్ని ముందే పరిశీలించుకోవాలని.. తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్, కేబుల్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు, నగరవ్యాప్తంగా గణేష్ ఉత్సవాల సందడి ఇప్పటికే మొదలైంది. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్(Khairatabad Bada Ganesh) దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ఈ ఘటనతో భక్తులు, నిర్వాహకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు.