తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి కీలక ట్వీట్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు.. రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంపూర్ణ ఆమోదమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి.. ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇక ఈ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ విజయం అంకితమని పేర్కొన్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి తన పట్టును నిలుపుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. మున్సిపల్ ఎన్నికల తీర్పుపై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిన నేపథ్యంలో.. తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు సంపూర్ణ ఆమోదం తెలిపారని.. అందుకు నిదర్శనమే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అంటూ అభివర్ణించారు.
తెలంగాణలోని పేదలతోపాటు.. మధ్య తరగతి ప్రజల సంక్షేమం సహా వరల్డ్ క్లాస్ ప్రణాళికలు, కార్యాచరణతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని.. గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులకు పట్టణ, నగర ప్రజలు ఈ తీర్పు ద్వారా బదులు చెప్పారని ట్వీట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరించిన ఈ విజయం.. తమ మీద ఉన్న బాధ్యతను మరింత పెంచిందని వెల్లడించారు. ప్రతి మున్సిపాలిటీని, కార్పొరేషన్ను మరింత గొప్పగా డెవలప్ చేసి ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.