‘నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్టుగా సీఎం అవుతా..’ రేవంత్కు MLA హెచ్చరిక
‘నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్టుగా సీఎం అవుతా..’ రేవంత్కు MLA హెచ్చరిక
మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి ఇవ్వాలని అన్నారు. లేదంటే తాను డైరెక్టుగా సీఎం అవుతానంటూ.. కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డిలను పరోక్షంగా హెచ్చరించారు. తనకు ఆ సత్తా ఉందని.. పదవి ముఖ్యం కాదంటూనే మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అదిష్ఠానాన్ని కోరుతున్నారు.
హైలైట్:
నాకు మంత్రి పదవి ఇవ్వండి
లేదంటే డైరెక్టుగా సీఎం అవుతా
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Munugode MLA
కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంత కాలంగా మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. గత మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ఆయనకు పదవి దక్కుతుందని భావించినా.. ఛాన్స్ మాత్రం రాలేదు. వివేక్, వాకిటి, అడ్లూరి, అజారుద్దీన్లకు విస్తరణలో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మంత్రి వర్గంలో రెండు ఖాళీలు ఉన్నాయి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీలో ఉన్న ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీని నెరేవేర్చుకోవాలని కోరుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా తన మంత్రి పదవి ప్రస్తావన తీసుకొస్తున్నారు.
తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే నెక్స్ట్ టార్గెట్ సీఎం పదవే అని.. డైరెక్టుగా ముఖ్యమంత్రిని అవుతానంటూ సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మెుత్తం 20 వార్డులకు 13 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి మున్సిపాలిటీని దక్కించుకున్నారు. ఈ విజయోత్సవ ర్యాలీలో సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు పాల్గొన్న కోమటిరెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
రాబోయే రోజుల్లో మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ మంత్రి పదవి రాకపోతే డైరెక్టుగా సీఎం అవుదాం అంటూ వ్యాఖ్యనించారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వాలని పరోక్షంగా సీఎం రేవంత్ను హెచ్చరించారు. తాను ఇంకా వేచి చూస్తానని.. పదవి గురించి తన బాధ కాదని అన్నారు. అభివృద్ధే తన లక్ష్యమని.. తనను మంత్రిని చేయకపోతే సీఎం కావటమే తన టార్గెట్ అని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇక మాట్లాడేది ఉండదని అన్నారు. ‘మీరు మునుగోడును చూసుకోండి.. నేను తెలంగాణను చూసుకుంటా’ అని ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యనించారు. సమయం వచ్చినప్పుడు జెండా ఎగురవేద్దామని అన్నారు. కాగా, కోమటిరెడ్డి కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్గా మారాయి. అయితే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి అన్న వెంకట్ రెడ్డి సైతం కొనసాగుతున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి పదవి దక్కటం లేదనే వాదన వినిపిస్తోంది.