ఏపీ ప్రజలకు మరో షాక్.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు.. ఉత్తర్వులు జారీ చేశారు
Andhra Pradesh Freehold Lands Registrations: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న విచారణ గడువును మరో నెల పాటూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలోనే ఈ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పత్రాలకు క్రమ సంఖ్య కేటాయించొద్దని ఆదేశాలు ఉన్నాయి. మరో నెల పాటూ ఈ ఆదేశాలను పొడిగించారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Andhra Pradesh Freehold Lands
ఏపీలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ నిలుపుదల(ఫోటోలు- Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ 1908 రిజిస్ట్రేషన్ చట్టం అమలులో ఉండగా.. అయితే సెక్షన్ 22ఏకు సంబంధించిన భూములు ఉన్నాయి. అయితే భూముల్ని ఫ్రీహోల్డ్గా మార్చడంతో పాటుగా భూ ఆక్రమణలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విచారణకు సంబంధించిన గడువును మరోసారి పొడిగించారు.. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ మరో నెల పాటూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ భూములకు సంబంధించి విచారణ కోసం గతంలో మూడు నెలల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కాలపరిమితి ఈ నెల 9తో ముగిసింది.. కానీ ఇప్పటికీ ఆ భూములకు సంబంధించిన విచారణ ముగించలేదు. అంతేకాదు దీనికి సంబంధించిన నివేదికలు కూడా సమర్పించలేదు. ఈ క్రమంలోనే మరోసారి నెల పాటూ విచారణ గడువు పొడిగించారు. ఇంతకుముందే అలాంటి భూముల రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. గతంలోనే ఈ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన పత్రాలకు క్రమసంఖ్య కేటాయించవద్దని ఆదేశించారు. తాజాగా విచారణ గడువు పెంచడంతో రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆంక్షలు కూడా కొనసాగుతాయి. ఈ మేరకు ‘రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలి’ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.