అంతా పర్లేదు.. ఆ 37 మందే.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు
అంతా పర్లేదు.. ఆ 37 మందే.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం రోజున పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరు మెరుగైందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే 37 మంది ఎమ్మెల్యేల పనితీరు ఇంకా మెరుగు పడాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు వన్ టూ వన్ భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ భేటీల తర్వాత పనితీరులో మార్పు వచ్చిందని చంద్రబాబు చెప్తున్నారు.
ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వన్ టూ వన్ భేటీల తర్వాత ఎమ్మెల్యే పనితీరు మెరుగైందని చంద్రబాబు అన్నారు. 37 మంది శాసనసభ్యులు మినహా మిగతా అందరి పనితీరు మెరుగుపడిందని.. ఓ 37 మంది ఎమ్మెల్యేల పనితీరు ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరుపైనా సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానన్న చంద్రబాబు.. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. శనివారం రోజున టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
ఈ సందర్భంగా బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ ఎలా నిస్వార్థంగా పనిచేస్తేందో.. అదే తరహాలో ఓ సిద్ధాంతం ప్రకారం పార్టీ క్యాడర్ను సంసిద్ధం చేసుకోవాలని నేతలకు సూచించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపైనా చంద్రబాబు చర్చించారు. వైఎస్ జగన్ అర్థం పర్థం లేకుండా మాట్లాడే మాటలు పట్టించుకోవద్దని సూచించారు. విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్న మాటలకు విలువ లేదన్న చంద్రబాబు.. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు.
మరోవైపు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు తిరుమల పరకామణి కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరకామణిలో రూ.70వేల చోరీ చేసి.. రూ.14కోట్ల ఆస్తి రాసిచ్చేందుకు సిద్ధమయ్యారంటే ఎంత సంపాదించి ఉండొచ్చని చంద్రబాబు ప్రశ్నించారు. పరకామణి కేసులో వైఎస్ జగన్ శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని చంద్రబాబు విమర్శించారు, వైఎస్ జగన్కు దేవుడు అన్నా, భక్తుల మనోభావాలు అన్నా పట్టింపులేదని.. దొంగతనాన్ని కూడా తప్పు కాదనే వాళ్లను ఏమనాలని చంద్రబాబు ప్రశ్నించారు. నేరస్తుల్ని వెనకేసుకొస్తూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి భక్తులు, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
మరోవైపు ఏపీలో లేడీ డాన్ల వ్యవహారం చర్చనీయాంశమవుతున్న వేళ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో అరుణ, అరవ కామాక్షి వ్యవహారం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లేడీ డాన్ల విషయంపై చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా స్పందించారు. వైసీపీ హయాంలో నెల్లూరులో మాఫియా చాపకింద నీరులా విస్తరించిందని ఆరోపించారు. లేడీ డాన్లు తయారు కావటం ఆశ్చర్యమేసిందన్న చంద్రబాబు..నేరాలకు పాల్పడే వారి తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు.
అమరావతిలో సమస్యలు పరిష్కారమై ప్రశాంతంగా ఉంటే.. కొంతమంది తట్టుకోలేకపోతున్నారన్న చంద్రబాబు… రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇక టీడీపీ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్న వాస్తవాన్ని తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా గుర్తిస్తున్నాయన్న చంద్రబాబు.. పరోక్షంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.