తిరుమల శ్రీవారి భక్తులకు బంపరాఫర్.. విమాన టికెట్ ధర రూ.2వేలు, జస్ట్ గంటన్నరలో తిరుపతికి వెళ్లొచ్చు
Rajahmundry To Tirupati Flight Service October 1st: రాజమహేంద్రవరం నుండి తిరుపతికి అక్టోబర్ 1 నుండి విమాన సర్వీసు ప్రారంభం కానుంది! ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరవుతారు. మొదటి రెండు రోజులు టికెట్ ధర కేవలం రూ.1,999 మాత్రమే. వారానికి మూడు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరాల మధ్య ప్రయాణం ఇక సులభతరం! ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
- రాజమహేంద్రవరం తిరుపతి విమాన సర్వీస్
- కేవలం రూ.1999కే తిరుపతికి దర్జాగా వెళ్లొచ్చు
- అక్టోబర్ 1 నుంచి విమాన సర్వీస్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరం నుంచి ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్న తిరుపతికి ఈ కొత్త విమాన సర్వీసును నడపనున్నారు. అక్టోబర్ 1 నుంచి అలయన్స్ ఎయిర్ (ATR 72) సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలిపారు. వారంలో మూడు రోజులు ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త విమాన సర్వీసు ప్రారంభం కావడం పట్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. అక్టోబర్ 1న ఉదయం 7.40 గంటలకు తిరుపతి నుంచి విమానం బయల్దేరి రాజమహేంద్రవరానికి 9.25 గంటలకు చేరుకుంటుంది. ఈ విమానం తిరుగు ప్రయాణంలో ఉదయం 9.50 గంటలకు రాజమహేంద్రవరం నుంచి బయల్దేరి తిరుపతికి ఉదయం 11.20 గంటలకు చేరుకుంటుంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
కొత్త సర్వీసు ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే రాజమహేద్రవరంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ ఆలోచనకు అనుగుణంగా ఈ విమాన సర్వీస్ ఏర్పాటు చేశారు. తిరుపతి, తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ విమాన సర్వీసు సౌకర్యంగా ఉంటుంది. మొదటి రెండు రోజులు ప్రయాణికులకు రూ.1999కే విమాన టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.