15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన
బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి సభలో మాట్లాడిన ఆయన… వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తామన్నారు.
ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తెలంగాణ పునర్నిర్మాణ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాట ఇచ్చిన ప్రకారం ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ విధ్వంసానికి గురైందన్నారు. నాగోబా ఆలయాన్ని గత ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే 7 వేల స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని… దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి 60 రోజులు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే 6 గ్యారంటీలు పూర్తి కాలేదని కొందరు అడుగుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం కనీసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన చేసిందా? అని ప్రశ్నించారు. త్వరలోనే లక్ష మంది మహిళలకు రూ.500లకు సిలిండర్ అందజేస్తామని.. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్ స్కీమ్ ను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఉచిత విద్యుత్ ను అందిస్తామని చెప్పారు.