Ram Rahim: అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేళ ప్రసవాలు.. బిడ్డకు రాముడి పేరు పెట్టిన ముస్లిం మహిళ

 Ram Rahim: అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేళ ప్రసవాలు.. బిడ్డకు రాముడి పేరు పెట్టిన ముస్లిం మహిళ

Ram Rahim: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం వేళ హిందువులు పులకరించిపోయారు. 5 శతాబ్దాల వివాదం సమసిపోయి.. అయోధ్యలో భవ్య రామ మందిర కల సాకారం అయింది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో సోమవారం ప్రసవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఓ ముస్లిం మహిళ ఆపరేషన్ చేయించుకుని తనకు పుట్టిన కుమారుడికి రాముడి పేరు పెట్టుకుంది. ఇక సోమవారం పుట్టిన శిశువులకు రాముడు, సీత పేర్లు కలిసి వచ్చేలాగా నామకరణం చేశారు.

Ram Rahim: హిందువుల చిరకాల స్వప్నం అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ సందర్భంగా కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ ఒక గొప్ప పండుగ లాగా ఈ వేడుకను జరుపుకున్నారు. ఇక అయోధ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన ముహూర్తం మంచిదని భావించిన చాలా మంది తమ జీవితంలో ముఖ్యమైన పనులను చేసుకున్నారు. ఇక గర్భిణీలు తాము అయోధ్యలో రాముడు కొలువు దీరనున్న సమయంలోనే ప్రసవించాలని పట్టుబట్టి మరీ ఆపరేషన్లు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఓ ముస్లిం మహిళ.. తనకు పుట్టిన బిడ్డకు హిందూ, ముస్లిం మతాలకు సంబంధించిన పేర్లు రెండు కలిపి పెట్టింది.

అయోధ్యలో బాల రాముడు కొలువుదీరిన దివ్య ముహూర్తంలోనే బిడ్డకు జన్మనివ్వాలని దేశవ్యాప్తంగా చాలా మంది గర్భిణీలు సోమవారమే ఆపరేషన్లు చేయించుకున్నారు. కొందరు నార్మల్ డెలివరీలు కాగా.. మరికొందరికి ఆపరేషన్లు నిర్వహించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన ఫర్జానా అనే ముస్లిం మహిళ సోమవారం ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పుట్టిన బిడ్డకు రాముడు, రహీం పేర్లు కలిసి వచ్చేలా రామ్ రహీం అని నామకరణం చేసింది. ఇక మహారాష్ట్రలోని థానేకు చెందిన ఓ మహిళకు డెలివరీ డేట్‌ మంగళవారం ఇవ్వగా.. డాక్టర్లకు విజ్ఞప్తి చేసి.. సోమవారం మధ్యాహ్నం 12.30 కు ఆపరేషన్ చేయించుకుంది.

ఇక దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఇలా ప్రసవాలు జరిగినట్లు తెలుస్తోంది. బిహార్‌ రాజధాని పాట్నాలోని పలు ఆస్పత్రుల్లో సోమవారం 500 మంది శిశువులు జన్మించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. మధ్యప్రదేశ్‌లోని 3 జిల్లాల్లో ఉన్న వివిధ హాస్పిటల్‌లలో సోమవారం కనీసం 47 మంది పిల్లలు పుట్టినట్లు అక్కడి అధికారులు గణాంకాలు విడుదల చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ గణేశ్‌ శంకర్‌ ఆస్పత్రిలో సోమవారం ఒక్కరోజే 25 మందికి కాన్పులు జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని కేవలం 2 ఆస్పత్రుల్లోనే 15 మంది బిడ్డలకు జన్మనిచ్చారు. అందులో 11 మందివి నార్మల్‌, నలుగురివి సిజేరియన్‌ డెలివరీలు అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

ఇక వారిలో చాలా మంది తమకు పుట్టిన మగబిడ్డలకు రామ్‌ అని.. ఆడ పిల్లలకు సీత అని పేర్లు పెట్టుకున్నారు. ఇంకొంత మంది రాఘవ్‌, రాఘవేంద్ర, రఘు, రామేంద్ర లాంటి పేర్లు పెట్టుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ సంభల్‌ జిల్లాలోని ఓ ఆస్పత్రి కాన్పుల వార్డులో అయోధ్య రామ మందిర నమూనాను ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని విజయపురలో జె.ఎస్‌.ఎస్‌. సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సోమవారం 20 మందికిపైగా మహిళలకు కాన్పులు జరిగినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *