జనసేనలోకి పాత కాపులు

 జనసేనలోకి పాత కాపులు

కాంగ్రెస్ పాతకాపులు జనసేన వైపు చూస్తున్నారా ? రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులుగా పోటీచేయబోతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు రోజుల్లో ఇద్దరు సీనియర్ నేతలు వల్లభనేని బాలశౌరి, కొణతాల రామకృష్ణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. బహుశా వీళ్ళిద్దరు రాబోయే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీచేయవచ్చు. విషయం ఏమిటంటే బాలశౌరి ఇపుడు మచిలీపట్నం వైసీపీ ఎంపీ. అయితే వైసీపీలోకి రాకముందు కాంగ్రెస్ లో కూడా ఎంపీగా చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు గట్టి మద్దతుదారుడు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ టికెట్ దక్కేది అనుమానంగా ఉండటంతోనే బాలశౌరి పార్టీ మారిపోవాలని అనుకున్నారు. అందుకనే పవన్ తో భేటీ అయ్యారు. ఈమధ్యనే ఎంపీ మాట్లాడుతు తాను ప్రస్తుతం వైసీపీ ఎంపీనే అయినప్పటికీ ఒకపుడు కాంగ్రెస్ వ్యక్తినే అన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అందుకనే బాలశౌరి వైసీపీ ఎంపీ అయినా కాంగ్రెస్ వాసనలు పోలేదనే సెటైర్లు పేలాయి. ఇక కొణతాలదీ అదే దారి.

ఒకపుడు కాంగ్రెస్ లో అనకాపల్లి ఎంపీగా పనిచేశారు. తర్వాత వైసీపీలో చేరి అక్కడ ఇమడలేక బయటకు వెళ్ళిపోయారు. చాలాకాలం స్తబ్దుగా ఉండిపోయి ఎన్నికల ముందు యాక్టివ్ అయ్యారు. ఈయన కూడా పవన్ తో భేటీ అయ్యారు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం బాలశౌరి మచిలీపట్నం లేదా గుంటూరు ఎంపీగా పోటీచేయబోతున్నారు. అలాగే కొణతాల అనకాపల్లి ఎంపీగా పోటీచేసే అవకాశముంది. వైసీపీ లేదా కాంగ్రెస్ పాతకాపులందరినీ పవన్ ఎందుకు చేర్చుకుంటున్నట్లు ?

ఎందుకంటే జనసేన తరపున పోటీచేయటానికి గట్టి అభ్యర్ధులు లేరు కాబట్టే. పొత్తులో భాగంగా జనసేన ఐదు ఎంపీ సీట్లను తీసుకున్నా పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులు లేరు. అందుకనే ఇపుడు పార్లమెంటులో పోటీచేసేందుకు అభ్యర్ధులను వెతుక్కుంటున్నారు. ఇందులో బాగంగానే కాంగ్రెస్, వైసీపీ నుండి వద్దామని అనుకుంటున్న పాత కాపులతో పవన్ భేటీ అవుతున్నారు. బాలశౌరి, కొణతాల లాగ భవిష్యత్తులో ఇంకెంతమంది వస్తారో చూడాలి. వైసీపీ ఎంఎల్ఏలు, నేతల్లో కొందరు టీడీపీలోకి వెళుతుంటే మరికొందరు జనసేనలోకి వెళతున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *