Chepala Gravy: ఇలా చేస్తే చేపల ఇగురు చిక్కగా, టేస్టీగా వస్తుంది, ఎలా చేయాలంటే..
Chepala Gravy: చేపలు పులుసు చేయడం సులువే కానీ, చేపల ఇగురు వండడం మాత్రం కాస్త కష్టం. దాని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

Chepala Gravy: ఎక్కువ మంది చేపల పులసును చేసుకునేందుకు ఇష్టపడతారు కానీ చేపల ఇగురు ఎక్కువగా వండుకోరు. పర్ ఫెక్ట్ గా వస్తుందో రాదో అనే సందేహం. ఇగురు చిక్కగా రావాలంటే వండే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. చేపల ఇగురు టేస్టీగా, చిక్కగా ఎలా చేయాలో చూద్దాం.
చేపలు -కిలో
ఉల్లిపాయలు – రెండు
వెల్లుల్లి రెబ్బలు – పది
అల్లం – చిన్న ముక్క
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – ఒక స్పూను
కారం – రెండు స్పూన్లు
పచ్చిమిర్చి – రెండు
ఆవాలు – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూను
దాల్చిన చెక్క – చిన్న ముక్క
లవంగాలు – మూడు
ధనియాలు – రెండు స్పూన్లు
మెంతులు – అర స్పూను
కరివేపాకులు – గుప్పెడు
కొత్తీమీర తరుగు – మూడు స్పూన్లు
టమోటాలు – రెండు
నూనె – నాలుగు స్పూన్లు
నీళ్లు – సరిపడినన్ని
చేపల ఇగురు రెసిపీ
1. కొన్ని చేపలతో పులుసు చేస్తే మరొకొన్నింటితో ఇగురు చేస్తారు. ఇగురు పెట్టే చేపలను తీసుకోవాలి.
2. చేపలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. పసుపు, ఉప్పు, కారం, కాస్త నూనె వేసి చేపలకు పట్టించి గంట సేపు మారినేషన్ చేయాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించి మిక్సీలో వేసి మసాల పొడి చేయాలి.
4. వెల్లుల్లి, ఉల్లిపాయల ముక్కలు, అల్లం మూడింటినీ కలిపి మిక్సీలో జార్లో పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి.
5. స్టవ్ మీద మరో కళాయి పెట్టి అందులోనూ నూనె వేయాలి. నూనె వేడెక్కాక అరస్పూను మెంతులు వేసుకోవాలి.
6. తరువాత కరివేపాకులు, నిలువుగా కోసిన పచ్చిమిర్చి వేసి వేయించాలి.
7. అవి వేగాక ఉల్లిపాయల పేస్టును వేసి వేయించాలి. ఇందులో సన్నగా తరిగిన టమోటాలను కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గించాలి.
8. కాస్త పసుపు, ముందుగా చేసుకున్న మసాలా పొడిని కూడా వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి.
9. ఇగురు కాబట్టి ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు. అరగ్లాసు నీళ్లు వేసుకుని ఉడకనివ్వాలి.
10. ఇప్పుడు మారినేషన్ చేసిన చేపముక్కల్ని కూడా వేసి మూత పెట్టాలి.
11. పదినిమిషాల తరువాత చేపలను రెండో వైపుకు తిరగేయాలి.
12. పైన కరివేపాకులు చల్లుకుని పావుగంటసేపు ఉడకనివ్వాలి.
13. దించేముందు కొత్తిమీర తరుగు చల్లుకోవాలి. టేస్టీ చేపల ఇగురు రెడీ అయినట్టే.