TSRTC : మహిళల ఉచిత ప్రయాణ స్కీమ్ కు మంచి స్పందన, రద్దీకి అనుగుణంగా బస్సులు – సజ్జనార్

 TSRTC : మహిళల ఉచిత ప్రయాణ స్కీమ్ కు మంచి స్పందన, రద్దీకి అనుగుణంగా బస్సులు – సజ్జనార్

TSRTC : టీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై ఎండీ సజ్జనార్ ఆరా తీశారు. జేబీఎస్ లో మహిళా ప్రయాణికులతో ఆయన మాట్లాడారు.

TSRTC : హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ” మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ” అమలు తీరుపై ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు.

జేబీఎస్ లో సజ్జనార్ ఆకస్మిక తనిఖీ

జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ సౌకర్యం అమలవుతున్న తీరును వారిని అడిగి సజ్జనార్ తెలుసుకున్నారు. అనంతరం జేబీఎస్-వెంకట్ రెడ్డి నగర్(రూట్ నంబర్ 18 వీ/జే) సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ఆయన ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ ను అందజేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు : సజ్జనార్

సజ్జనార్ మాట్లాడుతూ…… ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందని అన్నారు. మహిళల ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ గొప్ప కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీని భాగస్వామిగా చేసినందుకు ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

40 వేల మంది సిబ్బందికి అవగాహన

మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు సజ్జనార్. ఉచిత బస్ ప్రయాణ స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి…. వాటిపై 40 వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామని సజ్జనార్ గుర్తుచేశారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్థారించుకునేందుకు తమ ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించి సంస్థకు సహకరించాలని కోరారు.

పొరపాట్లు తలెత్తితే అధికారుల దృష్టికి తీసుకురావాలి

ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రవేశపెట్టగానే రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సులను నడిపేందుకు ప్లాన్ రూపొందించామని చెప్పారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు కొంత సమయనం పాటించి….. సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, 24 గంటలు అందుబాటులో ఉండే సంస్థ కాల్ సెంటర్ నంబర్లైనా 040-69440000, 040-23450033 ఫోన్ చేసి చెప్పొచ్చన్నారు. వాటిని వెంటనే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *