Chandrababu Visits KCR : కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Chandrababu Visits KCR : మాజీ సీఎం కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Chandrababu Visits KCR : హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం పరామర్శించారు. కేసీఆర్ తో చంద్రబాబు మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్, యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
పలువురి నేతల పరామర్శ
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సినీనటుడు ప్రకాశ్ రాజ్ తో పాటు పలువురు నాయకులు సోమవారం కేసీఆర్ను పరామర్శించారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, బీఆర్ఎస్ నాయకుడు చల్మడ లక్ష్మి నరసింహారావు యశోద ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ను పరామర్శించారు.
తుంటి మార్పిడి శస్త్రచికిత్స
గురువారం రాత్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. వైద్యుల పర్యవేక్షణలో వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో కేసీఆర్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కేసీఆర్ కు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.