బీఆర్ఎస్ లో టెన్షన్…టెన్షన్
కేసీయార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడేం మాట్లాడుతారో ఎప్పుడేం చేస్తారో కూడా
ఎవరికీ తెలీదు. ఇపుడు విషయం ఏమిటంటే అభ్యర్ధులపై జనాల మనోభావాలు ఏమిటో తెలుసుకునేందుకు
సర్వే బృందాలను నియోజకర్గాలకు పంపారట.
మామూలుగా ఎవరైనా ఏమిచేస్తారంటే సర్వేలు చేయించుకుని ఆ తర్వాత అభ్యర్ధులను ప్రకటిస్తారు.
కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం అభ్యర్ధులను ప్రకటించేసి జనాభిప్రాయాన్నితెలుసుకునేందుకు సర్వే
బృందాలను రంగంలోకి దింపారు.
అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేసే నిమ్మితం 20 బృందాలు రంగంలోకి దిగాయి. ఒకవేళ ఈ సర్వేల్లో
అభ్యర్ధుల గెలుపుపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే ఏమిచేస్తారు అనే విషయంలోనే అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
119 నియోజకవర్గాలకుగాను 115 నియోజకవర్గాల్లో దాదాపు పదిరోజుల క్రితమే అభ్యర్ధులను ప్రకటించేసిన
విషయం తెలిసిందే.
ఈ సర్వే బృందాలు ప్రతి నియోజకవర్గంలోను అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాల
అమలు, దళితబంధు, బీసీ బంధు, రైతు రుణమాఫీ లాంటి వాటిపై జనాల అభిప్రాయాలను సేకరిస్తాయి.
ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను, పథకాలను అమలుచేసినా, చేస్తున్నా ఇంకా మంత్రులు, సిట్టింగ్ ఎంఎల్ఏల
విషయంలో సానుకూలంగా ఎందుకు లేరనే విషయాలను సర్వే బృందాలు కారణాలను తెలుసుకుంటాయి.
సర్వే బృందాల నివేదికలపైనే నియోజకవర్గాల్లో గెలుపుకు ప్రత్యేక ప్రణాళికలను తయారుచేయాలని కేసీయార్
డిసైడ్ అయ్యారట. పార్టీవర్గాల సమాచారం ప్రకారం సుమారు 35 నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలపైన జనాల్లో
విపరీతమైన వ్యతిరేకత కనబడుతోందట.
మరి ఏమిచేస్తే జనాల్లో వ్యతిరేకత పోతుందో అర్ధంకావటంలేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే నియోజకవర్గాలను
కేసీయార్ ఎంఎల్ఏలకు సొంత ఆస్తిలాగ రాసిచ్చేశారు. దాంతో చాలామంది ప్రభుత్వ భూములను కబ్జాచేసేయటం,
ప్రైవేటు ఆస్తుల్లో పంచాయితీలు చేయటం ఎక్కువైపోయింది. చెరువులు, కుంటలు, కాల్వలని తేడాలేకుండా
కనబడింది కనబడినట్లుగా కబ్జాచేసేశారు. దాంతో జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది.
ఈ విషయం కేసీయార్ కు బాగా తెలిసే సిట్టింగులకే మళ్ళీ టికెట్లు ప్రకటించారు. ఎందుకంటే టికెట్లు నిరాకరిస్తే
వాళ్ళు ఎక్కడ తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఇరుకునపెడతారో అన్న భయం. అలాంటిది అభ్యర్ధులను ప్రకటించేసిన
తర్వాత ఇపుడు సర్వేలు చేయించుకుంటే ఉపయోగం ఏముంటుంది ?