ఏపీలోని ఆ ఏపీఎస్ఆర్టీసీ డిపో మూసివేత.. బస్సులు పక్క డిపోలకు కేటాయింపు, ఎందుకంటే!
Vijayawada Vidyadharapuram Apsrtc Bus Depot Vacate:
విజయవాడ సమీపంలో సిటీ బస్సులకు సంబంధించి ముఖ్యమైన విద్యాధరపురం బస్ డిపో సేవలు ఆగిపోనున్నాయి. ఈ డిపోన ఖాళీ చేయాలని ఆర్టీసీ విజయవాడ రీజనల్ అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఈ డిపోను ఖాళీ చేసే ప్రక్రియ మొదలైంది. నెలలో మొత్తం డిపో ఖాళీ చేసే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం విద్యాధరపురం డిపోను కేటాయిస్తున్నారు.
హైలైట్:
ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో ఖాళీ చేస్తున్నారు
విద్యాధరపురం డిపోపై ఆర్టీసీ నిర్ణయం
నెల రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తారు
Vidyadharapuram Apsrtc Bus Depot
విద్యాధరపురం బస్ డిపో
విజయవాడ సమీపంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపోను ఖాళీ చేయబోతున్నారు. ఆర్టీసీ అధికారులు విద్యాధరపురం బస్ డిపోను పూర్తిగా ఖాళీ చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. హైదరాబాద్కు చెందిన జీరో 21 లిమిటెడ్ నుంచి విద్యు్త్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించారు. పినాకిల్ అనే సంస్థకు విద్యుత్ బస్సుల నిర్వహణను అప్పగించారు. విద్యాధరపురం బస్ డిపోను పినాకిల్ సంస్థకు కేటాయిస్తారు. అక్కడ చార్జింగ్ స్టేషన్లు, రిపేర్లు, ఇతర నిర్వహణ వంటివి చేస్తారు. ఈ మేరకు విద్యాధరపురం బస్ డిపోకు అవసరమైన విద్యుత్ కనెక్షన్ కోసం ఇప్పటికే విద్యుత్ శాఖకు ఆర్టీసీ అధికారులు దరఖాస్తు చేశారు. ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.
విద్యాధరపుర బస్ డిపోలో మొత్తం 93 బస్సులు ఉంటే.. ఐదు బస్సులు మాత్రం స్పేర్ ఉంటాయి. మిగిలిన 88 బస్సులు తిరుగుతున్నాయి.. వీటిలో ఐదు సూపర్ లగ్జరీలు ఉన్నాయి. మిగిలిన 83 సిటీ బస్సులు కాగా.. విజయవాడలో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ రూరల్ గ్రామాలకు కొన్ని బస్సులు వెళతాయి. ఈ క్రమంలో విద్యాధరపురం బస్ డిపోలోని బస్సుల్ని ఆ దగ్గరలోనే ఉన్న గవర్నర్పేట-1, గవర్నర్ పేట-2, ఇబ్రహీంపట్నం బస్ డిపోలకు 45 సిటీ బస్సుల్ని కేటాయించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరో 43 బస్సుల్లో ఐదు సూపర్ లగ్జరీ బస్సుల్ని ఆటోనగర్ బస్ డిపోకు పంపిస్తారు. మిగిలిన వాటిలో 20 బస్సులు గన్నవరం డిపోకు, 19 బస్సులు ఉయ్యూరు డిపోకు, 2 బస్సులు నూజివీడు డిపోకు, రెండు బస్సులు జగ్గయ్యపేట డిపోకు కేటాయించారు.
ఇదిలా ఉంటే.. ఆర్టీసీ ఉద్యోగులు ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పినాకిల్ ప్రైవేట్ సంస్థకు విద్యాధరపురం బస్ డిపోను అప్పగించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిపోను ఖాళీ చేయమని ఆర్టీసీ అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ బస్సులు బాధ్యతను అద్దె ప్రాతిపదికన ఇవ్వడం మంచిదేనని.. కానీ డిపోను ఇవ్వొద్దని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ డిపోను ఇవ్వకుండా.. గొల్లపూడిలో ఉన్న ఆర్టీసీ స్థలాన్ని కానీ, విద్యాధరపురంలోని జోనల్ వర్క్షాప్ పక్కనే ఉన్న స్థలాన్ని కాని పినాకిల్ సంస్థకు ఇవ్వాలంటున్నారు. అక్కడ ఎలక్ట్రిక్ బస్సుల మెయింట్నెన్స్ చేయటం కుదురుతుందని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఈ విద్యాధరపురం ఆర్టీసీ బస్ డిపోలో బస్సుల్ని ఇతర డిపోలకు కేటాయించారు.. అయితే సిబ్బంది పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సిబ్బంది ఏ డిపోకు వెళ్లాలనుకుంటున్నారో ఆప్షన్ ఇస్తారేమో అనేది క్లారిటీ లేదు. అయితే ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల కేటాయింపుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తం మీద విద్యాధరపురం ఆర్టీసీ బస్ డిపో ఖాళీ చేయడం చర్చనీయాంశంగా మారింది.