25 మంది బీఆర్ఎస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కన పెట్టనున్న కేసీఆర్

 25 మంది బీఆర్ఎస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కన పెట్టనున్న కేసీఆర్

గులాబీబాస్‌ న్యూ పొలిటికల్‌ స్ట్రాటజీ అమలు చేయబోతున్నారా?.. సర్వే రిపోర్ట్‌లతో కొన్ని సర్దుబాటులు చేయాలని
డిసైడ్‌ అయ్యారా?.. ఇన్నిరోజులు పక్కకు పెట్టిన అస్త్రాలను.. ఇక బయటకు తీయనున్నరా?.. సిట్టింగులను కాదని
కొత్తవాళ్లతో ప్రయోగం చేయనున్నారా?.. ఇంతకీ.. కేసీఆర్ న్యూ స్ట్రాటజీ ఏంటీ?.. గులాబీబాస్‌ ప్లాన్‌తో ఎవరికి లాభం
చేకూరనుంది?..అనే మరిన్ని విషయాలను తెలుసుకొనే ప్రయత్నం చేదాం ..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక్కొక్కటిగా
బయటపడుతున్నాయి. స్వరాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి ఇప్పటివరకు ఎలాంటి అదృష్టానికి
నోచుకోనివాళ్ళు.. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డవాళ్ళు.. కేవలం నామినేటెడ్ పదవులకే పరిమితమైనోళ్ళు..
అలా వివిధ రకాల నేతలు యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణలో
జరిగిన మొదటి ఎన్నికల్లో గులాబీ పార్టీ 63 స్థానాలు గెలుచుకుంది. కానీ.. ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను
చేర్చుకొని మరింత స్ట్రాంగ్‌ అయింది. ఇక.. రెండోసారి జరిగిన ఎన్నికల్లో 88 స్థానాలు గెలిచి.. ప్రతిపక్షాల నుంచి
మరికొంత మందిని పార్టీలోకి తెచ్చుకుంది.

అదే క్రమంలో.. వచ్చే ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగరేసి హ్యాట్రిక్ నమోదు చేయాలని బీఆర్ఎస్‌ భావిస్తోంది.
ఎలాగైనా గెలవాలని కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే.. పలు సర్వేలు నిర్వహించింది. అయితే.. రెండు సార్లు
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కారణంగా వచ్చే సహజమైన వ్యతిరేకతతో కొంతమందిని మార్చాలని గులాబీబాస్
ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం 25 మంది సిట్టింగు ఎమ్మెల్యేలను పక్కనపెట్టే అవకాశముందని
తెలుస్తోంది. దానికి.. మొన్నామధ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సిట్టింగుల మార్పుపై చేసిన కామెంట్స్‌ బలాన్ని
ఇస్తున్నాయి. 25 మంది ఎమ్మెల్యేలను మార్చితే.. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనడంతో అధికార పార్టీ
ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది.

ఇదిలావుంటే… తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ.. కారు పార్టీలో గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు
కొత్త తలనొప్పి తీసుకొస్తున్నాయి. ఈ సారి తమకే టికెట్ అని కొందరు అంటుంటే.. లేదు లేదు.. తమకే టికెట్ అని
మరికొందరు ప్రచారం చేసుకోవడం పార్టీలో అంతర్గత సమస్యలకు కారణం అవుతోంది. పని చేయని ఎమ్మెల్యేలకు
టికెట్ ఇవ్వడం కష్టమని మొదటి నుండి హెచ్చరిస్తున్న కేసీఆర్.. ప్రస్తుతం అలాంటి వారిని ఐడెంటిఫై చేసినట్లు
తెలుస్తోంది. వారి స్థానంలో కొత్తవారిని నిలబెట్టేందుకు.. ఎవరైతే బాగుంటుందనే చర్చలు కూడా జరిపినట్లు
బీఆర్ఎస్‌ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీకి మొదటి నుండి పని చేసిన వాళ్ళకి, ఆర్థికంగా ఆదుకున్న
వాళ్ళకి, కేసీఆర్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్నవారికి ఈ సారి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది.
ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్లు, పని చేసిన వాళ్లను కూడా పరిగణనలోకి తీసుకునే చాన్స్‌ ఉందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్‌రెడ్డిని.. ఈ సారి ఎమ్మెల్యేగా హుజూరాబాద్ నుండి బరిలో దింపనున్నట్లు
కేటీఆర్ దాదాపుగా ఖరారు చేశారు. కౌశిక్‌రెడ్డి కూడా నియోజకవర్గంలో తిరుగుతూ ఎమ్మెల్సీ సంతృప్తిని ఇవ్వడంలేదని..
ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. మరో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని కూడా ఎమ్మెల్యేగా
బరిలో దించే అవకాశం కనిపిస్తోంది. మెదక్ నుండి పోటీ చేయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
మెదక్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్‌రెడ్డి సీనియర్ నాయకురాలు కాబట్టి.. ఆమెను బుజ్జగించి
ఆ స్థానంలో అత్యంత నమ్మకస్తుడైన శేరి సుభాష్‌రెడ్డిని ప్రమోట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం
జరుగుతోంది.

ఇక.. మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి ఈ సారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జనగామ నుండి బరిలో దించాలని
కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి.
పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల కొన్ని వర్గాలవారికి తీవ్ర వ్యతిరేకి అయ్యారు. ఈ సారీ ఆయనకే టికెట్
ఇస్తే ఇబ్బంది కలిగే అవకాశముంది. దాంతో.. ఆయన స్థానంలో కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు, ఎంపీ
సంతోష్‌కుమార్‌తో మంచి సాన్నిహిత్యం ఉన్న పోచంపల్లిని జనగామ బరిలో దింపి గెలిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
అలాగే.. ఎమ్మెల్సీ నవీన్‌రావుని కూడా ఈసారి గ్రేటర్ పరిధిలోని ఏదైనా నియోజకవర్గం నుండి పోటీలో పెట్టాలని
భావిస్తున్నారు. నవీన్‌రావుకి కూడా కేసీఆర్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు.. పార్టీ కోసం
తొలి నుండి తెరవెనుక ఎంతో హార్ట్‌ వర్క్ చేశారు. కేసీఆర్ దూతగా అనేక పనులు చక్కదిద్దిన నవీన్‌రావుకి.. ఈ సారి
గ్రేటర్ పరిధిలోని ఏదో ఒక టిక్కెట్‌ ఇవ్వాలని గులాబీబాస్‌ భావిస్తున్నారు.

మొత్తంగా… వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. న్యూ స్ట్రాటజీలో భాగంగా..
ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు.
అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నంలో వారికి ఎమ్మెల్సీ పదవులు ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది.
ఏదేమైనా.. కేసీఆర్ న్యూ పొలిటికల్‌ స్ట్రాటజీ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి మరి.

మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేసీఆర్ తన అంబుల పొదలో చాల అస్త్రాలు ఉన్నాయని అన్నారు .
కేసీఆర్ దగ్గరున్న అస్త్రాలు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాల్నిస్తాయో చూడాలి మరి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *