సీఎం రేవంత్ ను కలిసిన బీజేపీ ఎంపీ రఘునందన్
మెదక్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక ఎంపీ రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. మెదక్ కు మంజూరైన మెడికల్ కాలేజీ నిర్మాణానికి 20 ఎకరాల భూమి, రూ. 250 కోట్ల నిధుల మంజూరు చేయాలన్నారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు.
తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పాపన్నపేట మండలం ఏడుపాయల అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సీఎంకు ఆయన ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి సన్మానించారు. అనంతరం పలు అభివృద్ధి పనుల కోసం వినతిపత్రం అందజేశారు.
మెదక్ అసెంబ్లీకి మంజూరైన మెడికల్ కాలేజీ నిర్మాణానికి 20 ఎకరాల భూమి, రూ. 250 కోట్ల నిధుల మంజూరు చేయాలి
2. దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలోని హబ్సిపూర్ చౌరస్తా నుంచి దుబ్బాక అంబేద్కర్ చౌరస్తా వరకు 4వేలైన్ రోడ్ నిర్మాణానికి రూ. 20 కోట్ల నిధుల మంజూరు చేయాలి
3. శిలాజినగర్ నుండి ఏనుగుర్తి వరకు బొప్పాపూర్ మీదుగా వెళ్ళే రహదారి నిర్మాణానికి రూ.40 కోట్ల నిధుల మంజూరు చేయాలి.
పై నిధులను త్వరగా విడుదల చేసి.. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని రఘునందన్ రావు సీఎంను కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మెదక్ లో పర్యటించారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ చర్చికి తనకు గొప్ప సంబంధం ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చి ఈ చర్చిని దర్శించుకున్నానన్నారు. వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో వస్తానని ఆ నాడు భక్తులకు మాట ఇచ్చానన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారిని సీఎం దర్శించున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తదితరులు ఉన్నారు.