విద్యార్థులకు అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవులు
తెలంగాణలో కుండపోత వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హైలైట్:
- తెలంగాణలో కుండపోత వానలు
- నేడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

రోడ్లపై రాకపోకలు కష్టంగా మారాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లడం ప్రమాదకరమని భావించిన అధికారులు సెలవులను ప్రకటించారు. జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షపాతం కారణంగా అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోనూ రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది,
ఈ ఐదు జిల్లాలతో పాటు, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా స్థానిక పరిస్థితులను బట్టి సెలవుల నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, వరద నీరు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో సహాయక చర్యల కోసం విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వర్షాలు మరో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
భారీ వర్షాలు కురుస్తున్న కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్, కామారెడ్డి జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా.. ఎదుర్కునేందుకు అన్ని విభాగాలను, అధికారులను సర్వసన్నద్ధంగా ఉండాలని, వెంటవెంటనే అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని సీఎం రేవంత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.