రాజ్యసభ ఎన్నికల రేసులో ఎవరెవరు ఉన్నారు.. ఏకగ్రీవం అవుతాయా లేక పోటీ ఉంటుందా?
తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఉన్న చెరో స్థానం.. ఏప్రిల్ 9వ తేదీతో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో సంఖ్యా బలంగా చూస్తే.. హస్తం పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ.. అభ్యర్థిని బరిలో నిలుపుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది సీనియర్లు.. ఈ రాజ్యసభ రేసులో ఉన్నారు. అయితే ఖాళీ కానున్న రెండు స్థానాల్లో ఒక స్థానం ఇప్పటికే ఉన్న అభిషేక్ మను సింఘ్వికే దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మరి రెండో సీటు ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.
Rajya Sabha Elections
రాజ్యసభ ఎన్నికల రేసులో ఎవరెవరు ఉన్నారు.. ఏకగ్రీవం అవుతాయా లేక పోటీ ఉంటుందా?
రాజ్యసభ ఎన్నికలకు ఇటీవలె నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణలో 2 ఖాళీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ.. బీఆర్ఎస్ తరఫున కేఆర్ సురేష్ రెడ్డిల పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీతో పూర్తి కానుండటంతో.. ఆలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రెండు స్థానాలకు ఎవర్ని అభ్యర్థులుగా నిలబెట్టాలి అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయితే ఈ రెండు స్థానాలు ఏకగ్రీవం అవుతాయా లేక అభ్యర్థులు ఉంటే పోటీ ఉంటుందా అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది.
అయితే రెండు స్థానాలకు దక్కించుకునేందుకు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. సంఖ్యాబలం పరంగా చూస్తే.. రెండు సీట్లు కూడా హస్తం పార్టీ ఖాతాలోకి వెళ్లడం ఖాయమే అనిపిస్తోంది. దీంతో ఏకగ్రీవం అవుతుందనే ఆశలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. అదే సమయంలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టూ కూడా రాజ్యసభ ఎన్నికల బరిలో ఉంటే సమీకరణాలు ఏమైనా మారుతాయా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.
మరోవైపు.. ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలు తమకే దక్కాలని చాలా మంది ఆశావహులు కాంగ్రెస్ పార్టీలో ఎదురుచూస్తున్నారు. పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాజ్యసభ, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. అయినప్పటికీ అందులో కొందరు కీలక నేతలకు ఛాన్స్ దక్కలేదు. దీంతో అలాంటి వారు మొత్తం ఇప్పుడు ఈ 2 రాజ్యసభ స్థానాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి తిరిగి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీకే కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
ఇక పదవీ కాలం పూర్తి కాకుండానే కే కేశవరావు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానం నుంచి తిరిగి ఆయనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. దీంతో ఆయన కేవలం 2 ఏళ్లు మాత్రమే పదవీలో ఉండటంతో మరోసారి కే కేశవరావు పేరునే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదే సమయంలో పార్టీలో అత్యంత సీనియర్గా ఉన్న వీహెచ్ కూడా రాజ్యసభ ఎంపీ పదవిపై ఆశలు పెంచుకున్నారు. బీసీ వాదంతోపాటు తన సీనియార్టీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ హైకమాండ్ను వీహెచ్ కోరుతున్నారు.
ఇంకో సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకు ఎలాంటి అవకాశం రాకపోవడంతో.. రాజ్యసభలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఇక ఎస్టీ కోటాలో బెల్లయ్య నాయక్ కూడా పెద్దల సభకు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం కోటాలో జెట్టి కుసుమ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. జెట్టి కుసుమ కుమార్కు అవకాశం ఇవ్వాలని ఇటీవలే జగ్గారెడ్డి కూడా ప్రతిపాదించడం గమనార్హం. ఒకవేళ జెట్టి కుసుమ కుమార్కు కాకపోతే.. వీహెచ్ను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోదండ రెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తనకు రాజ్యసభ పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని కోదండ రెడ్డి పేర్కొనడం గమనార్హం.
వీరితోపాటు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు. గతంలోనే వేం నరేందర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినా అవకాశం దక్కలేదు. మరోవైపు.. సీనియర్ నేతలైన టీ జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వేణుగోపాల్ హర్కర, షబ్బీర్ అలీ కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ రెండు ఖాళీ రాజ్యసభ స్థానాలు దాదాపు ఏకగ్రీవం అవుతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఒక సీటు గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి బలం ఉండగా.. రెండో సీటు కూడా కావాలంటే ఇతరుల మద్దతు కావాల్సి వస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా రాజ్యసభ బరిలో బరిలో దిగితే.. సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి. 8 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ.. అటు కాంగ్రెస్కు గానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీకీ గానీ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. సీపీఐ, ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపనున్నాయి. సంఖ్యా బలం పరంగా చూస్తే.. బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టకుండా ఉంటే ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్తాయి.
ఫిబ్రవరి 26వ తేదీన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీని మార్చి 5గా పేర్కొన్నారు. మార్చి 6వ తేదీన నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 9 అని రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. ఎన్నికల పోలింగ్ మార్చి 16వ తేదీన (సోమవారం)
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. మార్చి 20వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.