రాజమండ్రి కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో కీలక విషయాలు
రాజమండ్రి కల్తీ పాల ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడయ్యాయి. పాల వ్యాపారి సరఫరా చేసిన పాలల్లో ఇథైలిన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసినట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక తేల్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కారణంగానే కిడ్నీలు దెబ్బతిని మరణం సంభవించినట్లు వివరించారు. మరోవైపు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇప్పటి వరకూ పది మంది చనిపోయారు. మరో పది మంది బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.
Rajahmundry milk case
రాజమండ్రి కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ ల్యా్బ్ రిపోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన రాజమండ్రి కల్తీ పాల ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇప్పటి వరకూ పది మంది చనిపోయారు. అయితే అందులో ఐదుగురి మరణాలకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎస్ ల్యాబ్ నివేదికలు వచ్చాయి. ఈ వివరాలను అధికారులు శనివారం రోజున వెల్లడించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ప్రకారం.. రాజమండ్రిలో పాల వ్యాపారి ఇళ్లకు పోసిన పాలల్లో ఇథైలిన్ గ్లైకాల్ అనే ప్రమాదకర రసాయనం కలిసినట్లు తేలింది. ఈ కెమికల్ కలిసిన పాలను తాగడం వలనే కిడ్నీలు దెబ్బతిని బాధితులు చనిపోయినట్లు నివేదిక తేల్చినట్లు అధికారులు తెలిపారు.
పాల వ్యాపారి గణేష్ వరలక్ష్మి డైరీ పేరుతో పాలకేంద్రం నిర్వహిస్తున్నారు. అయితే పాలకేంద్రంలో పాలను నిలువ ఉంచేందుకు ఓ ఫ్రీజర్ ఉపయోగించేవారు. అయితే ఫ్రీజర్ లీక్ అవుతూ ఉండటంతో.. గణేష్ లీక్ అయ్యే ప్రాంతంలో ఎంసీల్ అతికించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 15వ తేదీన గణేష్.. రోజూలాగానే పలువురికి పాలు పోశారు. అయితే పాలు చేదుగా ఉన్నాయని ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. అయితే గణేష్ వాటిని పట్టించుకోనట్లు తెలిసింది. అంతేకాకుండా అవే పాలను మరుసటి రోజు రాజమండ్రిలోని పలు ఇళ్లకు సరఫరా చేశారు. అయితే ఫ్రీజర్ నుంచి లీక్ అయిన కెమికల్స్ పాలల్లో కలిసి విషపూరితంగా మారినట్లు తెలిసింది.ఫ్రీజర్లో ఉన్న పదార్థాలను అధికారులు పరీక్షించటంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మరోవైపు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇప్పటి వరకూ పది మంది చనిపోయారు. మరో పది మంది బాధితులు అనారోగ్యంతో ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. కల్తీ పాలు తాగిన వారిలో అనూరియా, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వంటి సమస్యలను వైద్యులు గుర్తించారు. ఈ కేసులో పాల వ్యాపారి గణేష్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్లో ఉన్నారు. మరణించిన వారికి ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్రకటించింది.